పార్లమెంట్ ప్రారంభానికి రండి-విపక్షాల్ని కోరిన జగన్-ప్రధాని మోడీకి కంగ్రాట్స్..
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించబోతున్నారు. అయితే ఈ భవనాన్ని ప్రధాని మోడీకి బదులు రాష్ట్రపతి లేదా లోక్ సభ స్పీకర్ ప్రారంభించాలని విపక్షాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడంతో 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇవాళ ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేశాయి.
అయితే ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించాయి. దీనిపై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. వైసీపీ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు జగన్ వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమం బహిష్కరించిన విపక్షాలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన జగన్.. ఇందులో ముందుగా ప్రధాని మోడీకి పార్లమెంట్ ను జాతికి అంకితం చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. "గొప్ప, గంభీరమైన మరియు విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసినందుకు జీ. పార్లమెంటు, ప్రజాస్వామ్య దేవాలయం, మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది మరియు మన దేశ ప్రజలకు మరియు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు" అంటూ విపక్షాలకు జగన్ చురకలు అంటించారు.
అలాగే రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నానని జగన్ తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నా పార్టీ హాజరవుతుందంటూ చివర్లో జగన్ వెల్లడించారు. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన విపక్షాలపై జగన్ ట్వీట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications