చంద్రబాబు, పవన్ ను నిలదీయండి-జనాన్నిరెచ్చగొడతారా ? సత్యసాయి జిల్లాలో జగన్ కామెంట్స్
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ విపక్షాలు నిత్యం రెచ్చిపోతున్నాయి. అలాగే విపక్షాల్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ విపక్షాలపై మరోసారి విమర్శలకు దిగారు. చంద్రబాబు, పవన్ ను లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

వైఎస్సార్ ఉచిత పంటల బీమా
ఏపీలో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద పరిహారం పంపిణీ చేసే కార్యక్రమం సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేశారు.
ఈ సందర్భంగా రైతులకు తాము అందిస్తున్న పంటల బీమా పరిహారంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వాలకూ, ఈ ప్రభుత్వాలకూ తేడా గమనించాలని రైతుల్ని సీఎం జగన్ కోరారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు రూ.2977 కోట్ల పరిహారం జగన్ అందజేశారు.

చంద్రబాబు ఇచ్చారా ? పవన్ అడిగారా
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనంతపురం వచ్చాడని, గోదావరి జిల్లాలకు కూడా వెళ్లాడని, పట్టాదారు పాసు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు కుటుంబాన్ని చూపించగలవా? అని సవాల్ విసిరితే.. చూపించలేకపోయారని సీఎం జగన్ తెలిపారు.సీసీఆర్సీ కార్డు ఉండి.. ఆత్మహత్యచేసుకుని ఉన్న కౌలు రైతును ఒక్కరినైనా చూపించగలవా? అంటే చూపించలేకపోయారన్నారు.
మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో.. అదే రకంగా రైతులు చనిపోతే ఆవేదన వ్యక్తంచేస్తూ వారికి తోడుగా నిలబడ్డామన్నారు. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే.. జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చిందన్నారు. ఈ జిల్లాలకు పోవాలి, ఇలా గ్రామాలకు పోవాలని అని ఆ దత్తపుత్రుడికి ఆ రోజు గుర్తుకు రాలేదు. పరిహారం ఇవ్వాలని చంద్రబాబుకు అనిపించలేదన్నారు.

రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్న జగన్
గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని సీఎం జగన్ అన్నారు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశామన్నారు. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా?. అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు ఎలా మోసం చేశాడో మీరు చూశారని, ఆయన చంద్రబాబు నాయుడని జగన్ అన్నారు.
చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడన్నారు. ప్రజలను మోసం చేసి తోడుదొంగలైన వీరిద్దరు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? అని నిలదీశారు. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటేదాన్ని డైవర్ట్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు వీళ్లంతా ఏకం అవుతారు, ఉన్నది లేనట్టుగా , లేనిది ఉన్నట్టుగా అబద్ధానికి రంగులు పూస్తారని జగన్ తెలిపారు.

కోనసీమ రాజకీయాలపై జగన్ కీలక వ్యాఖ్యలు
కోనసీమలో క్రాప్ హాలిడే అని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారని జగన్ విపక్షాలను ప్రశ్నించారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్ అనే నేను తీర్చినందుకా అని అడిగారు. కేంద్రం నుంచి సకాలానికే డబ్బు రాకపోయిన 21 రోజుల్లోనే వారికి ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా ప్రయాస పడుతున్నానన్నారు. మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా? అంటూ ఇదే చంద్రబాబును, మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని అడుగుతున్నానన్నారు.
అలాగే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే మహానుభావుడి పేరును పెట్టామని, ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారన్నారు. ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇదా సామాజిక న్యాయం అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications