పోరాటం ఉధృతం చేస్తాం, గోదావరి నుంచి మొదలు - జగన్ కీలక ప్రకటన..!!
మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న రైతులకు అండగా నిలిచేందుకు పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించారు. పొగాకు రైతులకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తానని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తానే స్వయంగా వారి వద్దకు వస్తానని జగన్ స్పష్టం చేసారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పొగాకు రైతులతో సమావేశం అయ్యారు. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు. గోపాలపురం లేదా జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతులను కలుస్తానని చెప్పారు. ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ తరువాత కూడా ప్రభుత్వం స్పందించక పోతే కందుకూరులో మరో పర్యటన చేస్తానని చెప్పారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఏ జిల్లాలో ఏ పంట కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా పండిన పంటంలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేసారని జగన్ వివరించారు.

పర్యటనలకు సిద్దమని ప్రకటించిన జగన్
రాష్ట్రంలో దాదాపు 2332 మిలియన్ కిలోల పొగాకు పండితే ఇప్పటి వరకు కేవలం 38 మిలియన్ కిలోల మాత్రమే కొనుగోలు చేసారని జగన్ చెప్పారు. సాధారణంగా వంద రోజుల్లో పూర్తి కావాల్సిన కొనుగోలు ప్రక్రియలో 94 రోజులు గడిచినా అయిదో వంతు కూడా కొనకపోవటం ప్రభుత్వ వైఫల్యం గా పేర్కొన్నారు. సెప్టెంబర్ లో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పొగాకు ధర రూ 200 తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజునే మార్కెట్ లో ధరలు పడిపోయాయని గుర్తు చేసారు. దీని ద్వారా వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రైతులకు అన్యాయం జరిగితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జగన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications