అందుకే దాడి, ప్రాణహానీ, అవయవ దానంచేస్తా: ఆసుపత్రి వద్ద జగన్పై దాడి కేసు నిందితుడి ఆరుపులు
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావు అస్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది. పోలీసులు మంగళవారం అతనిని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తనకు ప్రాణహానీ ఉందని కేకలు వేశాడు.
జగన్పై దాడి మీద రివర్స్: 'రిమాండ్ రిపోర్ట్పై టీడీపీ ఏం చెబుతుంది, ఉలిక్కిపాటు ఎందుకు'
భుజాలు నొప్పి అంటే చికిత్స
న్యాయస్థానం ఐదు రోజుల పాటు అతనిని పోలీసుల కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం అతనిని పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. ఆ సమయంలో తనకు భుజాలు నొప్పి వస్తున్నాయని అతను చెప్పాడు. దీంతో స్థానిక వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు. అనంతరం కేజీహెచ్కు తరలించారు.
స్థానిక డాక్టర్ ఏం చెప్పాడంటే?
తొలుత స్థానిక వైద్యుడు దేవుడుబాబు ఆయనకు పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ సాధారణంగానే ఉందని, ఛాతిలో నొప్పి, చేతులు తిమ్మిరిగా ఉన్న నేపథ్యంలో కేజీహెచ్కు తీసుకెళ్లి వైద్యం చేయించాలని సూచించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అయితే తనకు వైద్యం వద్దని, అవయవాలు తీసుకుపోండని శ్రీనివాస రావు కోరుతున్నారని డాక్టర్ దేవుడు బాబు చెప్పారు. ఏ ఉద్దేశ్యంతో నిందితుడు అలా చెప్పాడో తెలియదన్నారు. సుదీర్ఘ విచారణతో విసుగు చెంది అలా చెప్పి ఉంటాడని అన్నారు.
తనకు ప్రాణహానీ ఉందని అరుపులు
అతనిని పెద్ద ఎత్తున పోలీసులు భద్రత మధ్య కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో నిందితుడు శ్రీనివాస్ తనకు ప్రాణహానీ ఉందంటూ పెద్ద ఎత్తున కేకలు వేశాడు. కేజీహెచ్ క్యాజువాలిటీకి తీసుకు వెళ్తుండగా అతను పెద్ద ఎత్తున అరిచాడు. కాగా, అతను మంగళవారం మధ్యాహ్నం భోజనం తినేందుకు నిరాకరించాడు. ఏమీ తినకపోవడం, తాగక పోవడం వల్ల నీరసించాడని తెలుస్తోంది. ఉదయం నుంచి మంచినీళ్లు కూడా తీసుకోలేదు.
రాష్ట్రం మంచి కోసమే దాడి చేశానని వ్యాఖ్య
ఈ సందర్భంగా అతను తాను రాష్ట్రం మంచి కోసమే జగన్ పైన దాడి చేసినట్లుగా చెప్పాడని తెలుస్తోంది. తనకు ప్రాణహానీ ఉందని, తనకు ఏదైనా జరిగితే నా అవయవలు దానం చేయాలని చెప్పాడు. రాష్ట్రం కోసమే జగన్ పైన దాడి చేసినట్లు చెప్పాడని తెలుస్తోంది. మీడియాతో మాట్లాడాలని కూడా చెప్పారని తెలుస్తోంది. నేను చెప్పాల్సింది ప్రజలకు చెబుతానని అన్నాడని సమాచారం. అయితే దీనిని పోలీసులు కొట్టి పారేస్తూ, సాధారణ వైద్య పరీక్షల కోసమే తీసుకు వచ్చినట్లు చెప్పారని తెలుస్తోంది. పోలీసులు అతనిని మాట్లాడనీయకుండా ముందుకు తీసుకెళ్లారు.
వీల్ చైర్, నీరసం.. ఆరోగ్యంపై అనుమానాలు
శ్రీనివాస రావును పోలీసులు మూడో రోజైన మంగళవారం విచారించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అతను అనారోగ్యానికి గురి కావడం, కెజీహెచ్కు వీల్ చైర్ పైన తరలించడం, మోసుకెళ్లడం, అతను అరవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస రావు చాలా నీరసంగా కనిపించాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. కాగా, అతనికి గుండెపోటు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.