విద్యార్ధులకు జగన్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ల ప్రదానం-సాఫ్ట్ స్కిల్స్ చరిత్రలో కొత్త అధ్యాయమని వెల్లడి..
ఏపీలో ఉద్యోగార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రభుత్వం ఇవాళ మైక్రోసాఫ్ట్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసింది. విశాఖలో సీఎం జగన్ విద్యార్ధులకు ఈ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా 40 విభాగాల్లో సుమారు 1.62 లక్షల మంది సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ తీసుకున్నారు. ఇలా శిక్షణ తీసుకున్న విద్యార్ధులకు ఇవాళ సీఎం జగన్ వైజాగ్ లో సర్టిఫికెట్లు అందజేశారు. మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలో తొలిసారిగా విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇప్పించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా 35,980 మంది విద్యార్థులకు ఇప్పటివరకూ శిక్షణ పూర్తయినట్లు ప్రకటించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం.. సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని యువతకు జగన్ తెలిపారు.
రాష్ట్రంలో విద్యార్థులపై ఆర్ధిక భారం పడకుండా శిక్షణ కోసం ఒక్కో విద్యార్థి మీద రూ.25 వేల నుంచి రూ.50 వేల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, ఆ ఖర్చు ఇప్పటివరకు రూ.32 కోట్లని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ప్రపంచంలో పోటీ పడేలా శిక్షణ ఇప్పించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చదువు ఉంటేనే పిల్లలు ప్రయోజకులవుతారన్న జగన్ .. విద్యారంగంలో తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పిల్లలను బడికి రప్పించే అమ్మఒడి దగ్గరి నుంచి.. నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం.. ఇలా మార్పులెన్నో తెచ్చినట్లు గుర్తు చేశారు.