'బాబు వల్ల ఉన్నదీ పోయింది, ఇష్టంలేకుండా హైద్రాబాద్ వదిలినందుకే'
ఢిల్లీ: 1969 నుంచి అమలవుతున్న ప్రత్యేక హోదా... ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ఢిల్లీలో అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడారు.
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని టిడిపి చెప్పిందని, కానీ ఆయన వస్తే కరువు మాత్రమే వస్తుందన్నారు. వసుంధర రాజే, సుష్మా స్వరాజ్ రాజీనామాల కోసం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్.. ఏపీ గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు.
చంద్రబాబు సింగపూర్, జపాన్ దేశాలు తిరగడం మానేసి, ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు మాట దేవుడు ఎరుగని, రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించే ప్రత్యేక హోదా కూడా పోయిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పరిస్థితే బిజెపి, టిడిపిలకు: ఈశ్వరి
చంద్రబాబు నాడు తన మామ ఎన్టీఆర్కు, నేడు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే ఈశ్వరి మండిపడ్డారు. జగన్ ప్రజల కోసం దీక్ష చేస్తున్నారన్నారు. ఈ టిడిపి, బిజెపి ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పదన్నారు.
ఏపీ ప్రజలు ఎంతమొత్తుకున్నా రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడదీశారని, అందుకే మాయమయ్యారన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి, బిజెపిలకు కూడా అలాంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు. వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఎన్ని కష్టాలకోర్చి అయినా హోదా సాధిస్తామన్నారు.
రాష్ట్ర విభజనను మనం అంగీకరించలేదు: ధర్మాన ప్రసాద రావు
65 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాదును విడిచి పెట్టలేక, తెలుగు ప్రజలను వీడదీయడం ఇష్టం లేక మనం విభజనను అంగీకరించలేదని ధర్మాన ప్రసాద రావు అన్నారు. మన అభీష్టానికి వ్యతిరేకంగా విభజన జరిగిందన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి రావడం వల్ల ఏపీ 65 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు.
అలాంటి వెనుకబాటుతనం ఉండకుండా చేసేందుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారని, బిజెపి కూడా పదేళ్లు డిమాండ్ చేసిందన్నారు. కేంద్రమంత్రులు, టిడిపి, బిజెపి ప్రత్యేక హోదా వస్తుందా లేదా చెప్పకుండా.. వివిధ రకాలుగా మాట్లాడుతున్నారన్నారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు పాలన చూశాక.. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే అది ఎక్కడకు వెళ్తుందో అందరికీ తెలుసునని చెప్పారు. అయినా మాకు ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా కావాలన్నారు. 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రజలను పట్టించుకోలేదన్నారు.
ఏపీ సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్రమని చెప్పారు. ఇబ్బందులు పడుతున్న రాష్ట్రమని తెలిపారు. చంద్రబాబు ఉన్నంత వరకు ఏపీకి కేంద్రం నుండి సాయం అందదని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. చంద్రబాబు ప్రజల కోసం మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు.
బిజెపి ఏపీకి అన్యాయం చేయవద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఉద్దేశించి అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎప్పుడు రాజధాని గురించి మాట్లాడటం, దేశాలు తిరగడమే అన్నారు. మీ మంత్రులు ఎవరు కూడా హోదా గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నారు.
చంద్రబాబుకు వ్యాపార ప్రయోజనాలు తప్ప మరొకటి లేదని ఏపీ ప్రజలు ఈ పదిహేను నెలల్లో గుర్తించారన్నారు. అందుకే జగన్ కేంద్రం దృష్టికి.. ఏపీ సమస్యను, ప్రత్యేక హోదా ఆవశ్యకతను తీసుకు రావడానికి దీక్ష చేపట్టారన్నారు.
మునికోటికి నివాళులు అర్పించి...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలకు దీక్ష ప్రారంభమైంది. తొలుత ప్రత్యేక హోదా కోరుతూ ప్రాణాలు విడిచిన మునికోటి ఫోటోను సభా వేదికపై ఉంచి, జగన్ నివాళులర్పించారు.
దీక్షలో విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలు, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలవరకు ఈ దీక్ష జరగనుంది. తరువాత పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు.