సమైక్య నినాదం: జగన్ నిరవధిక దీక్ష షురూ
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష హైదరాబాదులోని లోటస్ పాండు వద్ద శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆయన దీక్ష ప్రారంభమైంది. ఆయన దీక్ష చేస్తున్న క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.
ఆయనతో పాటు పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభాకర్ తదితరులు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. దీక్షా శిబిరంలో కూర్చున్న జగన్ నుదుట తిలకం దిద్దారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న ఆమరణ దీక్షకు అనుమతి లేదని హైదరాబాద్ వెస్ట్జోన్ డిసిపి సత్యనారాయణ అంతకు ముందు తెలిపారు. అనుమతి లేకుండా దీక్ష చేయడం నేరమని ఆయన అన్నారు.
దీక్షకు దిగితే అరెస్టుకు కూడా వెనుకాడబోమని పోలీసులు చెప్పారు. లోస్పాండ్ వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జగన్ దీక్షకు అడ్డుకుంటామని తెలంగాణ న్యాయవాదులు హెచ్చరించారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జగన్ శుక్రవారంనాడు ప్రకటించారు. రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని ఆయన అంటున్నారు.