మోడీ నిరాశ పరిచారు, చంద్రబాబు తాకట్టు పెట్టారు: వైయస్ జగన్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయ్స జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ 5 కోట్ల ప్రజలను తన ప్రసంగంతో మోడీ నిరాశపర్చారని విమర్శించారు.
శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, అయితే హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని జగన్ తెలిపారు.
మోడీ వస్తారు, చంద్రబాబు ఒత్తిడి తెస్తారని ప్రజలు అనుకున్నారని, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, ఢిల్లీ పక్కన ప్రవహించే యమునా నది నుంచి నీళ్లు తెచ్చారని, కానీ రాష్ట్రాన్ని విడగొడుతూ హోదా విషయమై ఇచ్చిన మాటను మరిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను చంద్రబాబుకు, మోడీకి నిరసనల ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదాపై నోరు విప్పని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగానే రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఆయన అన్నారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారని, కానీ ప్రధాని అసలు ఆ ఊసే ఎత్తకపోవడం అందరికీ దిగ్భ్రాంతికి కలిగించిందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై దాదాపు ఏడు రోజుల పాటు వైయస్ జగన్ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం మరో పోరుకు సిద్ధం కావాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.