West Bengal Exit Poll: ఇది కదా అసలైన ట్విస్ట్! బెంగాల్ టైగర్ ఎవరంటే!
బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని అగ్రనేతలందరూ సర్వశక్తులు ఒడ్డినా.. 'బంగ్లా' ప్రజల మనసు గెలుచుకోవడంలో మమతా బెనర్జీ మరోసారి తన మార్క్ చూపించారు. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు.. ఒక సామాన్య మహిళ జాతీయ శక్తులను ఢీకొని సాధించిన అసాధారణ విజయం! పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 'అధికారం మారుతుందేమో' అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 294 సీట్ల సమరంలో టీఎంసీ ఏకంగా 177-187 స్థానాలతో ప్రభంజనం సృష్టించబోతోందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు జరిగిన పోరులో అధికారం చేపట్టాలంటే 148 స్థానాలు అవసరం. అయితే, పీపుల్స్ పల్స్ సర్వే అంచనాల ప్రకారం.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఏకంగా 177-187 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. మరోవైపు అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ 95-110 స్థానాలకే పరిమితం కానుంది. కాంగ్రెస్ (1-3), వామపక్షాలు (0-1) నామమాత్రపు ఉనికిని మాత్రమే చాటుకోబోతున్నాయి.

ఎగ్జిట్ పోల్ లెక్కల ప్రకారం ఓట్ల శాతం:
- టీఎంసీ కూటమి: 46.5%
- బీజేపీ: 41.5%
- వామపక్షాలు: 4.1%
- కాంగ్రెస్: 2.1%
- ఇతరులు: 5.1%
బీజేపీని దెబ్బకొట్టిన 'సర్' భయం!
రాష్ట్రంలో 90 లక్షల ఓట్లను తొలగించడం బీజేపీకి అతిపెద్ద మైనస్గా మారింది. ఓటు హక్కు పోయిందని, రేపు రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. ముఖ్యంగా మాతూస్ సామాజిక వర్గం దీనిపై తీవ్ర ఆగ్రహంతో బీజేపీకి దూరమైంది. ముస్లిం సామాజిక వర్గం (రాష్ట్రంలో 35% జనాభా) బీజేపీకి వ్యతిరేకంగా ఏకపక్షంగా టీఎంసీ వైపు నిలవడం మమతకు కొండంత బలాన్ని ఇచ్చింది. సుమారు 112 స్థానాల్లో ముస్లిం ఓటర్లే గెలుపోటములను శాసించబోతున్నారు.
బెంగాలీ సెంటిమెంట్ వర్సెస్ జాతీయవాదం
బీజేపీ వినిపించిన జాతీయవాదం కంటే.. మమతా బెనర్జీ రగిలించిన 'బెంగాలీ సెంటిమెంట్' ప్రజల్లోకి బలంగా వెళ్లింది. మమతకు దీటైన నాయకుడు ఏ పార్టీలోనూ లేకపోవడం ఆమెకు కలిసొచ్చింది. బీజేపీ నుంచి సువేందు అధికారి గట్టి ప్రయత్నం చేసినా మమత ఇమేజ్ ముందు సాటిరాలేకపోయారు. దీనికి తోడు 'లక్కీ భండార్' వంటి పథకాలు మహిళా ఓటర్లను మమత వైపు మొగ్గు చూపేలా చేశాయి.
డివిజన్ల వారీగా ఫలితాలు:
- ప్రెసిడెన్సీ డివిజన్: కోల్కతా, హౌరా, 24 పరగణాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేయబోతోంది.
- మాల్దా డివిజన్: మైనారిటీలు అధికంగా ఉండే ఇక్కడ టీఎంసీ బలం నిరూపించుకోనుంది.
- జల్పాయ్గురి: ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది.
- మిడ్నాపూర్: ఇక్కడ బీజేపీ బలోపేతమైనా, ముస్లింలు ఉన్న చోట టీఎంసీదే పైచేయి.
చారిత్రక సహనం.. నాలుగోసారి టీఎంసీ?
బెంగాల్ ప్రజలకు రాజకీయంగా సహనం ఎక్కువ. గతంలో కాంగ్రెస్కు 25 ఏళ్లు, కమ్యూనిస్టులకు 35 ఏళ్లు అధికారం ఇచ్చిన బెంగాల్ ప్రజలు.. ఇప్పుడు అదే ఒరవడిలో టీఎంసీకి నాలుగోసారి అధికారం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి పటిష్టమైన పార్టీ యంత్రాంగం, కార్యకర్తలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద ప్రతికూలంగా మారింది.














Click it and Unblock the Notifications