కేసీఆర్లా.. మూడ్రోజులు బాబు బొమ్మలు దగ్ధం: జగన్
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల పైన ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు.. తమతో సహా విపక్షాలు అన్ని ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయని, ఇప్పుడు అదే మాదిరిగా ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయన పైన రుణమాఫీ కోసం ఒత్తిడి తీసుకు వస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. లోటస్ పాండులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రుణమాఫీ విషయంలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి వెనుకడుగు వేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయగానే.. ప్రతి గ్రామంలో రైతులు, విపక్షాలు బయటకు వచ్చి ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, అందులో టీడీపీ, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు.. ఇలా అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఒకరోజుకు కేసీఆర్ బయటకు వచ్చి మాట తప్పనని చెప్పారని, ప్రభుత్వం వ్యాఖ్యలను వెనక్కి తీసుకుందని చెప్పారు.
తెరాస మాట తప్పినప్పుడు తెలంగాణలో దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన టీడీపీ... తనదాకా వస్తే ఇప్పుడు ఏపీలో ఏం చేస్తోందని ప్రశ్నించారు. మీదాకా వచ్చేసరికి ఇలాంటి మోసమా, నిస్సిగ్గుగా రుణమాఫీపై పరిధి విధిస్తారా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ వెనుకడుగు వేసినప్పుడు ఎలాగైతే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చామే.. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు పైన ఒత్తిడి తెస్తామన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు కాలుస్తామన్నారు.
ఏపీ వ్యాప్తంగా రేపటి (గురువారం) నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని, వాటికి నరకాసుర వధ అని పేరు పెడుతున్నట్లు జగన్ చెప్పారు. బాబు ఏం చెప్పారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాలను ఎండగడతామన్నారు. తమతో పాటు బీజేపీ కూడా కలిసి రావాలన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు తమతో కలిసి రావాలన్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే 420 కేసులు పెడతారని, మాట తప్పిన బాబు పైన ఏం కేసు పెట్టాలని ప్రశ్నించారు.
మీడియాకు...
నిరసనలో మీడియా కూడా పాల్గొనాలని జగన్ హితవు పలికారు. చంద్రబాబును సమర్థించడం సరికాదని ఓ విలేకరికి హితవు పలికారు. కొన్ని ఛానళ్లు చంద్రబాబుకు మద్దతుగా పక్కదారి పట్టించేందుకు ఎందుకు ఆరాటపడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. గ్రామాలకు వెళ్లి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండని మీడియాకు హితవు పలికారు. ఇంకా బాబును వెనక్కి వేసుకు రావాలనే ఆలోచన వద్దన్నారు. రాజకీయం పక్కన పెట్టి రైతులు, ప్రజలు, మహిళల తరఫున మాట్లాడటానికి సిద్ధం కావాలని కోరారు.