YS Jagan : జీ20 సదస్సును రాజకీయం చేయొద్దు-కలిసి సక్సెస్ చేద్దాం-జగన్ సూచన
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ అశోకా హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న జీ 20 సదస్సుకు సంబంధించి సన్నాహకంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
జీ 20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనల కోసం వివిధ రాజకీయ పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించించింది. ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా హాజరయ్యారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ వేదిక కావడం పట్ల సీఎం వైయస్.జగన్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అశోకాహాలులో ఇవాళ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం మాట్లాడారు.
జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-20 సదస్సు విజయవంతం చేయడానికి అందరూకలిసికట్టుగా ముందుకుసాగాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విజయవాడ బయల్దేరారు.