తిరుమల టూర్ పై జగన్ కీలక నిర్ణయం-డిక్లరేషన్ వివాదం, నిరసనల హోరుతో..!
ఏపీలో తిరుమల లడ్డూ రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో రేపు శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. ఈ మేరకు తనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో దర్శనాలకు వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. అయితే తిరుమలకు జగన్ వస్తారని తెలియడంతో కూటమి నేతలు డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు రావాలని బీజేపీ సహా కూటమి పార్టీలు డిమాండ్లు చేయడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ తిరుమల పర్యటనకు వస్తే డిక్లరేషన్ పై తప్పకుండా సంతకం తీసుకుంటామని టీటీటీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగన్ వెనక్కి తగ్గారు. తిరుమల టూర్ కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. దానికి బదులు తాడేపల్లిలోనే ప్రెస్ మీట్ పెట్టి కూటమి సర్కార్ నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వస్తే అడ్డుకుంటామన్న కూటమి పార్టీల పిలుపు వివాదాస్పదమైంది. దీనిపై రాష్ట్రంలోనే భిన్న వాదనలు వినిపించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే కూటమి పార్టీలకు ఇందులో జోక్యం చేసుకోవద్దని చెప్పేశారు. జగన్ డిక్లరేషన్ వ్యవహారం టీటీడీ చూసుకుంటుందని చెప్పారు. అయితే ఆ తర్వాత స్పందించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తాము డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో కూటమి కూడా జగన్ ను తాము అడ్డుకోబోమని, కేవలం శాంతియుత నిరసనలు మాత్రమే తెలియజేయాలని నిర్ణయించింది. చివరిగా జగన్ తన టూర్ రద్దు చేసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్లయింది.












Click it and Unblock the Notifications