చెవిరెడ్డి ఎక్కడ, ఆ ట్రావెల్స్ నాదని నిరూపిస్తారా.. రిజైన్ చేస్తారా: బాబుకు జగన్
మ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేశారని, ఆయనను బయటకు కనపడనీయడం లేదని, ఆయన అంశాన్ని సభాపతి కోడెల శివప్రసాద రావు ఎందుకు పట్టించుకోవడం లేదని వైసిపి అధినేత జగన్ సోమవారం అన్నారు.
అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేశారని, ఆయనను బయటకు కనపడనీయడం లేదని, ఆయన అంశాన్ని సభాపతి కోడెల శివప్రసాద రావు ఎందుకు పట్టించుకోవడం లేదని వైసిపి అధినేత జగన్ సోమవారం అన్నారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
సభ జరుగుతుండగా ఎమ్మెల్యేను అక్రమంగా నిర్బంధించారని జగన్ విమర్శించారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేసి ఇంకా విడుదల చేయలేదన్నారు. చెవిరెడ్డిని బయటకు కనపడనీయడం లేదన్నారు.
చెవిరెడ్డి ఇష్యూను స్పీకర్ ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. సభాపరంగా రక్షణ ఉన్న ఎమ్మెల్యేను ఎలా తీసుకెళ్తారని అడిగారు. దీనిపై అడిగేందుకు సభలో ప్రయత్నిస్తే తనకు మైక్ ఇవ్వలేదని చెప్పారు.
అసలు ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్నారు. రవాణా శాఖ కమిషనర్ పైన దాడికి సంబంధించిన అంశాన్ని అడిగితే అరెస్ట్ చేస్తారా అన్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్తో తనకు సంబంధం ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారని జగన్ అన్నారు. అది నిరూపించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.
ఎక్కడ ఏం జరిగినా తనకు సంబంధం ముడిపెడతారా అని అడిగారు. ఇంత దారుణంగా అబద్దాలు ఎందుకని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అడ్డు పడుతున్నారని అడిగారు.