పవన్ పై స్పీడు పెంచిన జగన్ ? చంద్రబాబుకు మరో సంకేతం !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు రాటుదేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముందు చంద్రబాబు, బీజేపీతో కలిసి పనిచేసేలా సంకేతాలు ఇచ్చారు. కానీ తాజాగా వారాహి యాత్రలో సొంత వ్యూహాల్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో అప్పటివరకూ విడిగా పోటీ చేయలేరా అంటూ ప్రశ్నించిన జగన్ కూడా వ్యూహం మార్చుకోవాల్సి వస్తోంది.
ఇవాళ కురుపాంలో జరిగిన అమ్మఒడి నిధుల విడుదల సభలో సీఎం జగన్.. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఆయన పెళ్లిళ్ల దగ్గరి నుంచి వారాహి వాహనం, దానిపై పవన్ ఆవేశంగా వేసే డైలాగ్స్ వరకూ అన్నింటినీ జగన్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఇద్దరినీ కలిపి విమర్శలు చేస్తున్న జగన్.. ఈసారి మాత్రం పవన్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించారు. దీంతో పవన్ పై జగన్ రూటుమార్చారా అన్న చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తరహాలోనే విపక్షాలు విడివిడిగా పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటోంది. అప్పుడు విపక్ష ఓట్ల చీలికతో వైసీపీ పని సులువుతుంది. కానీ విపక్షాలు ఎప్పుడు ఏకమవుతాయో, ఎప్పుడు విడిపోతాయో తెలియనంత గందరగోళంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని కరాకండిగా ఎవరూ చెప్పలేని పరిస్దితి. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ స్పీడు పెంచుతున్నారు. అదే సమయంలో పవన్ ను టార్గెట్ చేస్తూ గతంలోలా రెచ్చిపోయేందుకు ఎన్నికల సమయంలో వైసీపీ కాపు నేతలు జంకుతున్నారు. దీంతో జగన్ నేరుగా రంగంలోకి దిగారు.
పవన్ కళ్యాణ్ ను, ఆయన వారాహి యాత్రను, వ్యక్తిగత జీవితాన్ని (పెళ్లిళ్లను) టార్గెట్ చేయడం ద్వారా జగన్ పూర్తిగా స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఇదే స్పీడు కొనసాగితే మాత్రం వైసీపీ వర్సెస్ జనసేనగా పోటీ మారిపోవడం ఖాయం. అప్పుడు ఆటోమేటిగ్గా చంద్రబాబు అవకాశాలకు దెబ్బకొట్టొచ్చనే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి విడివిడిగా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు విపక్షాలు సిద్దంగా ఉంటే అది అంతిమంగా తమకే మేలు జరుగుతుందని భావిస్తున్న జగన్.. ఇందులో భాగంగానే పవన్ ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications