సిగ్గులేకుండా మహిళలతో ఆడుకున్నారు, 200 వీడియోలు: బాబుపై జగన్ ఫైర్
హైదరాబాద్: మహిళలకు అధిక వడ్డీకి డబ్బులిచ్చి, వారి మానప్రాణాలతో సిగ్గులేకుండా ఆడుకున్నప్పటికీ కేసులు పెట్టడం లేదని వైసిపి అధినేత వైయస్ జగన్ మంగళవారం సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు.
కాల్ మనీ, బాక్సైట్ వ్యవహారంపై అతను ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల పైన చంద్రబాబు ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబు తవ్వకాల పైన చట్టవిరుద్ధంగా వెళ్తున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలలో చంద్రబాబు లంచాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారన్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పారు.
చంద్రబాబు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్ను కోరామని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలకు హత్యాయత్నం కింద కేసు పెట్టడం విడ్డూరమన్నారు.
చంద్రబాబు ఎన్నోసార్లు నీ అంతు చూస్తానని చెప్పారని, దాని అర్థం తమను చంపేస్తాననేని, అలాంటప్పుడు చంద్రబాబు పైన హత్యాయత్నం కింద కేసు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. కానీ గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరిజనులు చంద్రబాబు తల నరుకుతారని మాత్రమే చెప్పారన్నారు.
చంద్రబాబు దివంగత వైయస్ రాజశేఖ రెడ్డి పైన, తమ పైన ఎన్నో వ్యాఖ్యలు చేసినప్పటికీ హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదన్నారు. కానీ గిరిజనులు చంద్రబాబు తల నరుకుతారని చెప్పినందుకు గిరిజన ఎమ్మెల్యే ఈశ్వరి పైన కేసు పెట్టారన్నారు.
వ్యతిరేకంగా మాట్లాడితే తమను అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మొన్న తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పైన విమానాశ్రయంలో దాడి చేశారని కేసు పెట్టారన్నారు. ప్రయాణీకులు ఉండగానే విమానాశ్రయాన్ని మూసివేశారని, దానిని ప్రశ్నిస్తే కేసు పెట్టారన్నారు.
కాల్ మనీ పైన ఫిర్యాదు చేశాం
గుంటూరు, విజయవాడ నగరాలని మాఫియా నగరాలుగా మార్చారని జగన్ మండిపడ్డారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా.. చివరకు కాల్ మనీ మాఫియా కూడా అక్కడే వెలుగు చూస్తోందన్నారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో పైన దాడి చేస్తే దానిపై కేసు పెట్టలేదన్నారు.
ఇదే చింతమనేని ప్రభాకర్ అంగన్వాడీల పైన తిట్టరాని తిట్లు తిట్టినా చంద్రబాబు పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్షాత్తు చంద్రబాబే లిక్కర్ మాఫియాను నడుపుతూ, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా అనుమతి ఇచ్చారన్నారు.
లిక్కర్ మాత్రమే కాకుండా కల్తీ మద్యం కూడా ఉందన్నారు. అయిప్పటికీ కేసులు పెట్టడం లేదన్నారు. యావత్ ఆంధ్ర రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమేదైనా ఉందా అంటే అది కాల్ మనీ అన్నారు. కాల్ మనీ కేసులో చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డబ్బులు ఉన్నాయన్నారు.
మహిళలకు, బాధితులకు డబ్బులు ఇచ్చి వారి మాన ప్రాణాలతో సిగ్గులేకుండా ఆడుకున్నారని మండిపడ్డారు. పోలీసులు రెయిడ్ చేస్తే ఆడవారు అసభ్యకరంగా ఉన్న 200 వీడియోలు బయటపడ్డాయన్నారు. అయినా సిగ్గులేకుండా టిడిపి ఎమ్మెల్యే విదేశాలలో ఉంటారన్నారు. ఎమ్మెల్సీ పైన కేసులు ఉండవన్నారు.
ఇంత జరుగుతున్నా చంద్రబాబు తమ పార్టీ నేతల పైన చర్యలు తీసుకోరన్నారు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వమన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఓ సర్వే విడుదల చేసిందని, దానిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.
డ్వాక్రా రుణమాఫీ బాగుందని చెప్పిన వారు 35 శాతం మంది చెప్పారని సర్వేలో తేలిందన్నారు, అసలు రుణమాఫీ జరగకుంటేనే బాగుందని ఎలా చెబుతారన్నారు. పోలీసుల తీరు చాలా బాగుందని సర్వేలో తేలిందని చెప్పడం విడ్డూరమన్నారు.
చంద్రబాబు చేయించుకున్న సర్వేలు ఎలాగున్నా పైన దేవుడు ఉన్నాడని, ఎన్నికలు వస్తే ప్రజలు ఆయనకు మొట్టికాయలు వేయడం ఖాయమని చెప్పారు. అడ్డగోలుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, రాత్రి మూడు గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు.