అండగా ఉంటా: తుఫాన్ బాధితులకు జగన్ ఓదార్పు
విశాఖపట్నం: హుధుద్ తుఫాను విలయతాండవం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన తుఫాను తాకిడి ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఆయన మంగవాళం ఉదయం హైదరాబాదు నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన విశాఖపట్నం జిల్లాకు చేరుకున్నారు.
వైయస్ జగన్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో ధ్వంసమైన జీడి మామిడి తోటనలు పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. బాధితులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందించేవరకు తమ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తుఫాను తాకిడికి గురైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఆయన ఈ నాలుగు జిల్లాల్లోనే ఉంటారు. రైతుల తరఫున పోరాడుతామని ఆయన చెప్పారు.
హుధుద్ తుఫాను తాకిడికి విశాఖపట్నం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా తుఫాను వల్ల అపారమైన నష్టం వాటిల్లింది.