ఆ 40 మందిపై మా 40,000 మంది ప్రతిస్పందించివుంటే ఏం జరిగేది..
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా పొదిలిలో తన కాన్వాయ్ పై జరిగిన దాడి పట్ల జగన్ తీవ్రంగా స్పందించారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని చంద్రబాబును ప్రశ్నించారు.
రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు, ప్రజలు తరలివచ్చారని, తాము వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారని పేర్కొన్నారు.
హింసను సృష్టించడానికి పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40,000 మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ?.. అని జగన్ పేర్కొన్నారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?.. అని జగన్ నిలదీశారు. పొదిలి పర్యటన, పొగాకు రైతుల పరామర్శ, భరోసా కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం కాదా అని పేర్కొన్నారు.
రోమ్ నగరం తగలబడుతూ ఉంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా చంద్రబాబు వ్యవహారశైలి ఉందని జగన్ మండిపడ్డారు. ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications