ప్రభుత్వంపై విరుచుకపడ్డ జగన్: అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విరుచుకుపడ్డారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై తక్షణ చర్చ జరగాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద రావు పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
బాబు వస్తారు...జాబు వస్తుందని చెప్పి... అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఏపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. శనివారం సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ - ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐకేపీ, అంగన్వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. జగన్తో ఉంటే జాబ్ రాదు, జైలుకు వెళ్తారంటూ ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను ఉద్దేశించి ఆయన పదే పదే అన్నారు. చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే పదినిముషాలు పాటు వాయిదా పడ్డాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్.. ఐకేపీ, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. మరో మార్గంలో ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ సూచించారు.
ఐకేపీ ఉద్యోగుల సమస్యల అంశం తీవ్రమైనదే అయినప్పటికీ...అత్యవసరంగా చర్చించాల్సింది కాదని అన్నారు. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించినా కనీసం మంత్రితో సమాధానమైనా చెప్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని వాయిదా తీర్మానంపై సమాధానం చెప్పేది లేదని స్పష్టం చేశారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ అసెంబ్లీని పది నిమిషాలు వాయిదా వేశారు.