అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్.. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత షాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రి మొదటిగా ఏపీ సీఎంకే అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. భేటీలో షా ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం..

ఏం మాట్లాడారంటే..
ఏపీలో నెలకొన్న అన్ని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రికి సీఎం జగన్ బ్రీఫింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, మూడు రాజధానాల ఏర్పాటు, పెండింగ్ నిధుల విడుదల తదితర అంశాలపై జగన్ వినతి పత్రాలను ఇచ్చారు. అదే సమయంలో ఇటీవల ఏపీలో ఆలయాలపై వరుస దాడులు, అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను కూడా సీఎం జగన్.. షా దృష్టికి తీసుకెళ్లారు.

రాత్రి ఢిల్లీలోనే బస..
అమిత్ షాతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్రెడ్డి, బాలశౌరి కూడా ఉన్నారు. షాతో భేటీ అనంతరం ఇంకొందరు మంత్రులను కలిసి, వీలైతే ప్రధాని మోదీతోనూ జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న ఏపీ సీఎం.. బుధవారం ఉదయం నేరుగా తిరుపతికి వెళతారని సమాచారం. వివాదాస్పద వ్యవసాయ బిల్లు సహా ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు పార్లమెంటులో వైసీపీ మద్దతు తెతిపిన నేపథ్యంలో వైసీపీ అధినేత ఢిల్లీ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

అమిత్ షాకు సాయిరెడ్డి స్పెషల్ వినతి
ఏపీ సీఎం జగన్ తో కలిసి అమిత్ షాను కలవడానికి ముందు రాజ్యసభ సమావేశాల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో మాదిరిగా ఏపీలోనూ ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిని సాయిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటును వైసీపీ స్వాగతించిందని, నేర కారణాలను పరిశోధించే ఇలాంటి యూనివర్శిటీ ఏపీలోనూ ఏర్పాటు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications