తప్పించుకున్నారు, రాజీనామా చేయాలి: చంద్రబాబును ఏకేసిన జగన్
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటుపై తాము చర్చ జరగాలని పట్టుబడుతుంటే శాసనసభలో ఉండి కూడా చంద్రబాబు సమావేశాలకు రాలేదని, తన గదికే పరిమితమ్యారని ఆయన అన్నారు. శాసనసభకు వచ్చి నోటుకు ఓటుపై తన వాదనను వినిపించే ధైర్యం చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.
సమావేశాలకు వచ్చి తన వాదనను వినిపించాల్సి ఉఁడిందని, అలా చేయకుండా చంద్రబాబు తప్పించుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఓటుకు నోటు వ్యవహారంపై తాము వాయిదా తీర్మానంతో పాటు 244 నిబంధన కింద చర్చకు కూడా నోటీసు ఇచ్చామని, తాము సరైన పద్ధతిలో రాలేదనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు.
లంచం ఇవ్వజూపుతూ ఒక్క ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం దేశంలో ఇదే బహుశా మొదటిసారి అని ఆయన అన్నారు. తన వాయిస్తో ఆడియో రికార్డింగులో చంద్రబాబు పట్టుబడ్డారని, చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బును లంచంగా ఇవ్వజూపుతూ టిడిపి ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని, కచ్చితమైన ఆధారాలతో పట్టుపడితే శాసనసభలో చర్చకు అనుమతి ఇవ్వకపోవడం సరి కాదని ఆయన అన్నారు.
విషయం కోర్టులో ఉంది కాబట్టి శాసనసభలో చర్చించడానికి వీలు కాదని అన్నారని, అయితే నోటుకు ఓటు కేసు ఆ దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. దానికి కోర్టును చూపుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యులు తనపై, తన తండ్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా వ్యవస్థను మేనేజ్ చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే చేయడం తప్పు కాదు గానీ నన్ను పట్టుకోవడం తప్పు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఎపిలో చంద్రబాబు లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బును, అదీ నల్లడబ్బును 8 మంది శాసనసభ్యులను కొనడానికి వినియోగించే పరిస్థితి అని ఆయన అన్నారు. నేరుగా ఆడియో, వీడియోల్లో దొరికిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగడానికి చంద్రబాబు నైతిక అర్హత లేదని ఆయన అన్నారు.
పట్టి సీమనుంచి ఇసుక మాఫియా దాకా అన్నీ అక్రమాలేనని ఆయన అన్నారు. జీవో 28ద్వారా కొంతమందికే లైసెన్సులు ఇచ్చారని ఆయన అన్నారు. లంచాల కోసం, కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నడిపిస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడ నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే దాని గురించి శాసనసభలో మాట్లాడవద్దని అంటున్నారని ఆయన చెప్పారు. కరువుపై చర్చ సందర్భంగా నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడవద్దని చెప్పారని అంటూ కరువుకు, నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధం ఎలా ఉండదని అడిగారు.
స్పీకర్ న్యాయంగా ఉంటే తాము 344 కింద కూడా నోటీసు ఇచ్చాం కాబట్టి చర్చకు అనుమతి ఇచ్చి ఉండేవారని ఆయన అన్నారు. శాసనసభలో తనపై రామాయణం విప్పుతారని, మరణించిన తన తండ్రి గురించి మాట్లాడుతారని, కనీసం ఆరుగురితో తమను తట్టించిన తర్వాత తమ మైకు కట్ చేసి తిరిగి తాను మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తున్నారని ఆయన అన్నారు.
తాము పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని, పట్టిసీమపై వైఖరిని బాగా ఆలోచించుకుని చెప్పాలని చంద్రబాబు వెటకారంగా తమను అడిగారని, పట్టిసీమను తాము వ్యతిరేకిస్తున్నామని, ఆ ప్రాజెక్టుపై డబ్బులు ఖర్చు పెట్టడం వృధా అని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని, ఇందులో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని అన్నారు. శాసనసభా వేదికను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు.