నా పాలన ఇలానే: జగన్, ఫైళ్లకు ముందే గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వ్యవహారాల్లో పెను మార్పులు తీసుకొస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన పాలనలో హైకోర్టు, కాగ్లను భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పాలనాపరంగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. కొన్ని విషయాల్లో కోర్టులు, కాగ్ వంటివి తప్పుపట్టడం, వాటికి మీడియా అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఇరుకునపడిపోతోందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు దీనిని తమకు అనుకూలంగా మలచుకుని ప్రభుత్వం లేదా అందులోని కొందరు వ్యక్తులపై విమర్శల దాడి చేస్తున్నారని తెలిపారు. దీంతో, వారంతా అవినీతిపరులుగా ముద్రపడిపోతున్నారని వెల్లడించారు.

ఇలాంటి వాటిని నియంత్రించేందుకు పాలనలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు జగన్ వివరించారు. నిర్ణయాలు తీసుకున్నాక కాగ్ తప్పుపట్టడం ఇప్పుడు జరుగుతోందనీ.. అది చేయలేదు.. ఇది చేయలేదు అనడం.. మీడియా దానిని వక్రీకరించడం జరుగుతోందనీ తెలిపారు. అందుకే తానొక భారీ మార్పును తీసుకు రాబోతున్నాని, అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వమే కాగ్, హైకోర్టు దగ్గరకు వెళుతుందని చెప్పారు.
‘ఏం చేయదలచుకున్నామో చెబుతాం.. ఫైళ్లను మీకు పంపిస్తాం. మీరు ఏ మార్పులు చేర్పులు చెబితే వాటిని చేస్తాం. పనులు చేసిన తర్వాత తప్పులు పట్టవద్దు. చేయకముందు మీరే చెప్పండి. నేనడిగేదల్లా.. నిర్దిష్ట కాల వ్యవధిలో ఫైళ్లను పరిష్కరించాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తర్వాత టెండర్ ప్రక్రియను మీరు ఎలా చెబితే అలా వెంటనే ప్రారంభిస్తాం' అని అని కాగ్, హైకోర్టులకు స్పష్టం చేయనున్నట్లు జగన్ తెలిపారు.
అంతేగాక ‘ఒక్కసారి ఫైళ్లకు అనుమతి ఇచ్చేసిన తర్వాత.. పనులు చేసిన తర్వాత మాత్రం మీరెవ్వరూ తప్పులు పట్టకూడదు. తప్పులు పట్టి వక్రీకరించడానికి, రాజకీయం చేయడానికి చూసే ఈనాడు వంటి పత్రికలు ఏవైనా తప్పుబడితే వారిని కోర్టు ధిక్కారం కింద తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టండి'' అని కాగ్, హైకోర్టులకు స్పష్టం చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఇటువంటి విధానం కారణంగా అవినీతిరహిత, పారదర్శక పాలన చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications