జగన్ విఫలం, మనం ఆక్రమించాలి: డిగ్గీతో నేతలు, 'కాపు' చీఫ్పై తర్జన
విజయవాడ: ఏపీలో అధికార టిడిపి పైన ఎలా ముందుకు వెళ్లాలి, ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నాడు చర్చించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మావాడేనని చెప్పుకోవడంలో విఫలమయ్యామని పలువురు నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వైయస్ను వైసిపి అధినేత జగన్ సొంతం చేసుకున్నారని చెప్పారు. అలాగే, వైసిపి విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్పష్టత ఇవ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు.
కాపులకు అధ్యక్ష పదవిపై చింతామోహన్ సూచన
కాపులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని సీనియర్ నేత చింతామోహన్ సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనను కొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి బాగా పని చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరొకరు అవసరం లేదని చెప్పారు.
జగన్ విఫలం.. ఆ ప్లేస్ భర్తీ చేయాలి
ప్రతిపక్ష నేతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆ స్థానాన్ని మనం భర్తీ చేయాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. సభలో ప్రజాప్రతినిధులు లేకపోయినప్పటికీ.. వైసిపి విఫలమైనందున ప్రజల్లో ఆ స్థానాన్ని మనం భర్తీ చేద్దామన్నారు. అలాగే, జెఎన్యు రాజకీయాలు, రాహుల్ గాంధీ మద్దతు తదితర అంశాలపై చర్చించారు.
దిగ్విజయ్ విలేకరుల సమావేశం
దిగ్విజయ్ సింగ్ శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. భారత్లో రెండు రకాల రాజకీయ పార్టీలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆ రెండింటిల్లో మొదటి రకానికి చెందిన పార్టీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, డబ్బున్నవారికి కొమ్ముకాస్తుందన్నారు.
రెండో రకానికి చెందిన పార్టీల్లో మహాత్మగాంధీ ఆలోచనలు, నడవడి ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ దారిలో నడిచే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే అతివాదాన్ని ప్రోత్సహించే పార్టీలతో దేశానికి ప్రమాదమన ఆయన చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా దాడులు జరగడం బాధాకరమన్నారు.