పవన్ ట్రాప్ లో వైసీపీ-అంతా కోరుకున్నట్లే-ఆన్ లైన్ టికెట్లు కోరినోళ్లు మౌనం-చివరికి జగనే విలన్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆన్ లైన్లో సినిమా టికెట్లు విక్రయించాలని ఏ నిమిషాన నిర్ణయం తీసుకుందో కానీ చివరికి అది రోజుకో మలుపు తిరిగి తమ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ విషయంలో సీఎం జగన్ అంచనాలు మరోసారి తప్పాయా అన్న చర్చ కూడా నడుస్తోంది. దీనంతటికి ప్రధాన కారణం ఆన్ లైన్ టికెట్లను కోరిన వాళ్లు మౌనంగా ఉండిపోతుండగా.. దాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ ట్రాప్ లోకి వైసీపీ వెళ్లిపోతుండటమే. తాజాగా పవన్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు ఇచ్చిన కౌంటర్లతో ఎవరికి మైలేజ్ దక్కిందన్న దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఆన్ లైన్ టికెట్ల డిమాండ్
ఏపీలో టాలీవుడ్ చిత్రాల టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తే బ్లాక్ మార్కెట్ దక్కి తమకు మేలు జరుగుతుందని చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటు సురేష్ సహా పలువురు ఇండస్ట్రీ పెద్దలు గతంలో జగన్ సర్కార్ ను వేడుకున్నారు. కరోనా సమయంలో సీఎం జగన్ తో భేటీ అయిన వీరంతా టాలీవుడ్ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఆన్ లైన్ టికెట్ల డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. దీనికి వైసీపీ ప్రభుత్వం అంత సులువుగా రియాక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో టాలీవుడ్ పెద్దలు జగన్ ను కలిసి తమ డిమాండ్ వినిపించి వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
జగన్ సర్కార్ తొలి అడుగు
టాలీవుడ్ పెద్దలు ఆన్ లైన్టో సినిమా టికెట్లు అమ్మిపెట్టాలని కోరిన తర్వాత కూడా జగన్ సర్కార్ చాలా కాలం పాటు మౌనంగానే ఉండిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భఁగా ఎప్పుడైతే దాని అదనపు షోలకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత నిర్మాతలు కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకోవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్న విమర్శలతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. చివరికి ఆన్ లైన్ ద్వారా టికెట్ల వ్యవహారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటే పవన్ కళ్యాణేం ఖర్మ టాలీవుడ్ అంతా తమ చేతుల్లోకి వస్తుందని జగన్ సర్కార్ భావించింది. అనుకున్నదే తడవుగా తాజాగా కేబినెట్ భేటీలో ఆమోదించి మరీ ఆన్ లైన్ టికెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్ తీసుకురావాలన్న నిర్ణయం తీసేసుకున్నారు.
ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై రచ్చ
ధియేటర్లలో నేరుగా టికెట్లు విక్రయించడానికి బదులుగా ఆన్ లైన్ లోనే సినిమా టికెట్లు అమ్మేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ఆన్ లైన్లో టికెట్లు అమ్ముతున్న సర్కారు.. పైరసీని అరికట్టేందుకు సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టాలని కొందరు, సినిమా నిర్మాణం నుంచి విడుదల వరకూ అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించి అందరికీ లాభాలు పంచాలని మరికొందరు డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడటం మొదలైంది.
పవన్ వ్యాఖ్యలతో టర్నింగ్ పాయింట్
వైసీపీ సర్కార్ ఆన్ లైన్ సినిమా టికెట్లు విక్రయించాలన్న నిర్ణయాన్ని తాజాగా రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు అంతటితో ఆగకుండా ఆన్ లైన్ టికెట్లపై టాలీవుడ్ తో చర్చలు జరిపిన మంత్రి పేర్నినానిని టార్గెట్ చేశారు. సన్నాసి అంటూ విమర్శలు చేస్తూ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం తనను టార్గెట్ చేసుకుని టాలీవుడ్ ని వదిలేయాలంటూ ఓ కీలక సూచన కూడా చేశారు. దీంతో ఒకేసారి వైసీపీ సర్కార్ తనను టార్గెట్ చేస్తోందని, అదే సమయంలో తనను అడ్డుపెట్టుకుని టాలీవుడ్ ను టార్గెట్ చేస్తోందనే సంకేతాలు పంపారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఊహించినట్లే వైసీపీ సర్కార్ కు ఎక్కడో తాకాయి.
వైసీపీ మంత్రులంతా అటాక్
పవన్ ఎప్పుడైతే ఆన్ లైన్ టికెట్ల వివాదంలో వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారో అప్పుడు మంత్రులంతా కలిసి ఆయన్ను కౌంటర్ చేయడం మొదలుపెట్టేశారు. ఇందులో ఒక్కో మంత్రీ ఒక్కో విధంగా పవన్ ను టార్గెట్ చేశారు. ఓ మంత్రి మీరూ, సంపూర్ణేష్ బాబు మాకు ఒక్కటే అంటే, మరో మంత్రి మేం సన్నాసులమైతే నువ్వు రుషి పుంగవుడివా అని ప్రశ్నించారు. చివరికి పవన్ టార్గెట్ చేసిన అసలు మంత్రి పేర్నినాని మరింతగా రెచ్చిపోయారు. నేను సన్నాసివైతే నువ్వు సన్నాసిన్నర అన్నారుయ అంతేకాదు నా కొడుకు అంటూ బూతుల్లోకి కూడా దిగిపోయారు. అదేమంటే మేమేం కాపులమంటూ కలర్ ఇచ్చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ విమర్శలకు మంత్రులు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారని అంతా అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం వేరు.
పవన్ ట్రాప్ లో వైసీపీ ?
ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఇదేదో యథాలాపంగా జరిగిందని అంతా భావించారు. ఆ తర్వాత వైసీపీ మంత్రులు పవన్ కు కౌంటర్లు వేస్తున్నప్పుడు ఇది కూడా సహజమే అనుకున్నారు. దీంతో వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదంగానే దీన్ని అంతా చూశారు. కానీ అసలు జరిగింది వేరు అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విసిరిన ట్రాప్ లో వైసీపీ ఇంత దారుణంగా ఇరుక్కున్నట్లు ఆలస్యంగా అర్ధమైంది. పవన్ వ్యాఖ్యల్ని నిశితంగా గమనిస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఇంతకీ పవన్ వ్యాఖ్యలతో ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నోరు మెదపని టాలీవుడ్ పెద్దలు
ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్లు కావాలని కోరిన టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి సురేష్, ఇతర నిర్మాతలు దీనిపై వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకపోగా.. ఏమీ పట్టనట్టుగా మౌనంగా ఉండిపోయారు. టాలీవుడ్ లో ఆన్ లైన్ సినిమా టికెట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించేందుకు వారు సిద్ధం కాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసినా టాలీవుడ్ పెద్దలు మాత్రం నోరు మెదపలేదు. దీంతో వీరి మౌనంతో మరో చర్చ మొదలైంది.
మరోసారి టాలీవుడ్ దృష్టిలో జగనే విలన్ ?
ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించాలని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఈ డిమాండ్ ను లేవనెత్తిన వారు స్వాగతించలేదు. అదే సమయంలో టాలీవుడ్ లో కీలకంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరో పవన్ కళ్యాణ్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తనను టార్గెట్ చేసుకోండి టాలీవుడ్ ను వదిలేయండి అంటూ సంచలన వ్యాఖ్య కూడా చేశారు. దీనిపైనా టాలీవుడ్ నుంచి స్పందన లేదు. దీంతో సీఎం జగన్ ఆన్ లైన్ టికెట్ల విక్రయాలను ఎవరి కోసం తీసుకున్నారో వారే మౌనంగా ఉండిపోయినట్లయింది. ఇది అంతిమంగా వైసీపీ సర్కార్ మెడకు చుట్టుకోవడం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ రాగానే కనీసం పలకరించడానికి కూడా రాలేదని విమర్శలు ఎదుర్కొన్న టాలీవుడ్.. ఇప్పడు అదే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మౌనంగా ఉండిపోవడంతో సీఎం జగన్ మరోసారి విలన్ గా మారిపోయారు.