420 కేసు పెట్టాలా?..840నా: రుణమాఫీపై చంద్రబాబును ఏకేసిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పంట రుణాలనే మాఫీ చేస్తామంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడుపై 420 కేసు పెట్టాలా? లేక 840 కేసు పెట్టాలా? అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏపి మేనిఫెస్టో వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పేర్కొన్నారని చెప్పారు. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు పత్రిక ఈనాడులో కూడా వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటన ఇచ్చారని చెప్పారు. ఎన్నికల కమిషన్కు కూడా అన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బాబు చెప్పారని తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవం నాడు కూడా రైతు రుణమాఫీపై ఈనాడు పత్రికలో పెద్ద ప్రకటన ఇచ్చారని ఆ పత్రికను చూపించారు. వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తామని అందులో ప్రకటించారని చెప్పారు. కొన్ని పత్రికల్లో, టీవీల్లో కూడా అవే ప్రకటనలు వేశారని అన్నారు. చంద్రబాబు చేసిన ప్రకటను కూడా టీవీలో ఈ సందర్భంగా చూపించారు. రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, మొదటి సంతకం దానిపైనే చేస్తామని బాబు అన్నారని చెప్పారు.

రైతులు రుణాలు కట్టవద్దని, అన్ని రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారని అన్నారు. 2014, మార్చి 31నాటికి రైతు రుణాలు రూ. 87,612 కోట్లు డ్వాక్రా రుణాలు రూ. 14,204 కోట్లు ఉన్నాయని తెలిపారు. బాబుకు అన్ని తెలిసిన అప్పుడు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. ఇప్పుడు ప్లేటు మారుస్తున్నారని ఆరోపించారు. తాను అప్పుడు వ్యవసాయ రుణాలని అనలేదని, పంట రుణాలు మాత్రమేనని అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు అంటున్నారని చెప్పారు.
ఇంటికో ఉద్యమని, బాబు వస్తే జాబు వస్తుందని ప్రకటనలు గుప్పించారని ఆరోపించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగులకు రూ. 2వేల భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి మర్చిపోయారని అన్నారు. మోసం చేసే దోరణిని బాబు కొనసాగిస్తున్నారని అన్నారు. కోటి రుణాల ఖాతాలుంటే వాటిని 22లక్షలని చెబుతున్నారని అన్నారు. దీంతో 14శాతం వడ్డీ అంటే రూ. 14వేల కోట్ల భారం రైతులపై పడుతోందని అన్నారు. అన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
తొలి సంతకం రుణమాఫీపై పెడతానని.. కోటయ్య కమిటీపై పెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు అపరాధ వడ్డీ మాటత్తెడం లేదని మండిపడ్డారు. రైతుల బీమా డబ్బులను కూడా బ్యాంకులే అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని అన్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 86మంది రైతులు ఆత్మహత్య చేరసుకున్నారని, ఒక్క అనంతపురంలోనే 40మంది ఆత్మహత్య చేసుకున్నారని జగన్ తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications