చంద్రబాబు ఉండడు.. ఆ పార్టీ ఉండదు: వైయస్ జగన్
అనంతపురం/పశ్చిమగోదావరి: ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండడని.. ఆ పార్టీ కూడా ఉండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల ఉన్నత చదువుల కోసం పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మారలేదని అన్నారు. అధికారం కోసం నోటికొచ్చిన హామీలిస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
చంద్రబాబులా తాను అబద్ధాలు ఆడనని, విశ్వసనీయత అనే పదానికి అర్థం కూడా బాబుకు తెలియదని అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పని చేసినా ప్రజల గుండెల్లో వైయస్ రాజశేఖర్రెడ్డి చిరస్మరణీయుడై ఉన్నారని జగన్ చెప్పారు. వైయస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తనకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని అన్నారు.
వైయస్ను గుర్తు తెచ్చుకోండి: విజయమ్మ
పశ్చిమగోదావరి: ఎన్నికల్లో ఓటు వేసే ముందు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో అన్నీ కుంభకోణాలేనని ఆరోపించారు.