ఆకాశంలో చక్కెర్లు కొట్టి వెళ్లిపోయారు: చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
అమరావతి: భారీ వర్షాల ధాటికి పంట దెబ్బతిని రైతులు తల్లడిల్లిపోతుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ముఖం చాటేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. భారీ వర్షాలు, వరదల బీభత్సానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు రెండు రోజుల పర్యటన కోసం జగన్ సోమవారం గుంటూరు జిల్లాకు వచ్చారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పొలాలను ఆయన పరిశీలించారు.

నేల మీదకు రండి. రైతుల కష్టాలను చూడండి
ఈ సందర్భంగా గురజాల పట్టణంలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్లో మాట్లాడారు. ‘అయ్యా ముఖ్యమంత్రిగారూ ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్లలో తిరిగితే ఏం అర్థమౌతుంది. నేల మీదకు రండి. రైతుల కష్టాలను చూడండి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి.' అని సీఎం చంద్రబాబుకు సూచించారు.

రైతుల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు
రుణాలు మాఫీ కాక, బ్యాంకుల్లో రుణాలు పుట్టక, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేస్తే.. ఈ సంవత్సరం చేలో వేసిన పంట చేలోనే పోయిందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవడం లేదు. రైతులు ఎలా బతకాలి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బంగారం తాకట్టు పెట్టి
బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి కాస్తోకూస్తో తక్కువ వడ్డీకి రుణం తీసుకుందామనుకుంటే, ఆ అవకాశమూ రైతులకు లేకుండా పోయిందన్నారు. బంగారం పెట్టుకొని రైతులకు రుణాలు ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు.

నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు
ఇక, పులిచింతలలో 45 టిఎంసిల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ 30 టిఎంసిలు మాత్రమే నిల్వచేసి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. అంతేగాక 20వేల టిఎంసిల దాకా గోదావరి జలాలను కూడా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు.

ఎన్నో ఇబ్బందులుపడి పంటలను కాపాడుకున్నారు
ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో సరిపడా వర్షాలు లేకపోయినప్పటికీ రైతులు ఎన్నో ఇబ్బందులుపడి కాపాడుకున్న పంటలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా ప్రత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు అల్లాడుతున్నారన్నారు.

పంట పొలాలను పరిశీలించిన జగన్
దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వరద వల్ల నష్టపోయిన పంట పొలాలను జగన్ సోమవారం పరిశీలించారు. స్వయంగా ఆయన పొలాల్లో నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న రైతులతో మాట్లాడారు. వర్షాల వల్ల ఉడికెక్కిన పత్తి మొక్కలను జగన్కు చూపించి తాము భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

కంటితుడుపు చర్యలు మాత్రమే
ఈసందర్భంగా జగన్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు మాత్రమే చేపడుతోందని, రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయడంలేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంటలు వరదలో మునిగిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications