కమీషన్ల మీదే చంద్రబాబుకు ఆసక్తి: జగన్, విశాఖ రైల్వే జోన్ కోసం పాదయాత్ర: బొత్స
ప్రాజెక్టుల కంటే కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే చంద్రబాబుకు ఆసక్తి ఎక్కువ అని జగన్ ఆరోపించారు.
కడప: వైఎస్ హయాంలో దాదాపుగా పూర్తి చేసిన ప్రాజెక్టులను.. ఇప్పుడు తానే పూర్తి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదం అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. శనివారం నాడు ఆయన పైడిపాలెం రిజర్వాయర్ ను పరిశీలించారు. పైడిపాలెం రిజర్వాయర్ కు సంబంధించి 80శాతం పనులు వైఎస్ హయాంలో పూర్తయినవే అని గుర్తు చేశారు.
ప్రాజెక్టుల కంటే కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే చంద్రబాబుకు ఆసక్తి ఎక్కువ అని జగన్ ఆరోపించారు. రూ.300కోట్లు ఖర్చు పెట్టి ఉంటే రాయలసీమ ఈపాటికే సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. ప్రాజెక్టులపై చంద్రబాబు తీరు ప్రచార ఆర్భాటానికే పరిమితమని విమర్శించారు.
పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపించేందుకు కానిస్టేబుల్ చాలు అని జగన్ అభిప్రాయపడ్డారు. రూ.120కోట్ల పరిహారానికి ప్రభుత్వం ఒప్పుకుంటే పులిచింతలలో 45టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న 55టీఎంసీల నీటిని కాపాడుకునేవారమని జగన్ అన్నారు.
విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం:
విశాఖ రైల్వే జోన్ పట్ల కేంద్రం సానుకూలంగా లేకపోవడం.. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించకపోతుండటంతో.. రైల్వే జోన్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
శనివారం నాడు విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్న బొత్స.. మార్చి 9లోగా విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రైల్వే జోన్ పై ప్రకటన చేయని నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి నుంచి భీమిలి వరకు 250కి.మీ పాదయాత్ర చేపడుతామని అన్నారు.రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ఆకాంక్షలను చంద్రబాబు అర్థం చేసుకోవడం లేదని బొత్స మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కింది ఏమి లేకపోయినా.. సీఎం చంద్రబాబు స్వీట్లు పంచుకోవడం దారుణమని బొత్స అన్నారు. భూసేకరణ పేరిట టీడీపీ నేతలు భారీగా కమిషన్లు దండుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి హోదాపై ప్రశ్న లేవనెత్తితే కమిటీ వేశఆమని చంద్రబాబు అనడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉత్సవ్ పండుగ కాదు ఒక జాతర అని చెప్పారు.