బాబు బాటలో జగన్: ఢిల్లీ రాజకీయం వెనక పెద్ద వ్యూహమే!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై కొనసాగిస్తున్న పోరాటంలో తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. తాను లక్ష్యంగా ఎంచుకున్న వారిని జాతీయ స్థాయిలో ముద్దాయిగా నిలబెట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు గతంలో అనుసరించిన విధానాన్నేజగన్ ఇప్పుడు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ విధంగా అంటే.. వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఢిల్లీ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన బాబు.. అప్పట్లో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం జగన్ కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు. బాబు పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి కీలక ఘటనను ఢిల్లీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు బాబు.
పరిటాల రవి హత్య, ఓబుళాపురం మైనింగ్, పార్టీ నేతల హత్యలు, వైయస్ అక్రమ సంపాదన అంటూ ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పోరాటం చేశారు. అందుకు వామపక్షాలతోపాటు, బీఎస్పీ లేదా సమాజ్వాదీపార్టీ, లోక్దళ్, జేడీయూ వంటి పార్టీలను సమన్వయం చేసుకునేవారు. అందరినీ కలసి వినతి పత్రాలు ఇవ్వడం, వారితో కలిసి మీడియాతో మాట్లాడి తనకు మద్దతునిచ్చేలా చూసుకోవడంలో బాబు సఫలీకృతులయ్యారు.
ముఖ్యంగా వైయస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ.. తాను చేసిన పోరాటానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు బాబు. రాష్టప్రతిని కూడా తరచూ కలిసేవారు. ఆ రకంగా ఏపీ రాజకీయ వ్యవహారాలను ఢిల్లీ దృష్టిని ఆకర్షించడంలో బాబు విజయం సాధించారు. అంతేగాక, చివరకు సమన్యాయం చేయాలని ఏపీభవన్ వేదికగా ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారు.

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా గతంలో బాబు నడిచిన బాటలోనే అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తాజాగా ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి కాలంలో జగన్ రాష్టప్రతిని తరచూ కలుస్తున్నారు.
అంతేగాక, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు, ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ వినతి పత్రాలను కూడా సమర్పిస్తున్నారు. వామపక్ష పార్టీ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరిని కూడా తరచూ కలుస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా కలిశారు. హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. వామపక్షాలూ ఇందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
అదే విధంగా బాబు రాజకీయ అవినీతి అంటూ ముద్రించిన అవినీతి చక్రవర్తి చంద్రబాబునాయుడు పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. దానిని కేంద్రమంత్రులకు అందించారు. దేశంలో ఉన్న ప్రతి ఎంపీ క్వార్టరు, ఢిల్లీలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఆ పుస్తకం చేర్చారు. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో జగన్ విజయం సాధించారనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications