విదేశీ పర్యటనకు వైఎస్ జగన్
అమరావతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరిక లేని షెడ్యూల్ను గడుపుతున్నారు. ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్ను సంసిద్ధులను చేయడానికి ఇటీవలే ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..ఇందులో పాల్గొంటోన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికిస్తోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేస్తోన్నారు. దీనికి మంచి స్పందన లభిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశాల్లో గడపబోతోన్నారు. భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి ఈ నెల 21వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఎక్కడికి వెళ్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భాలు తక్కువే. 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన జెరూసలేం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల పాటు పర్యటించి వచ్చారు. అదే ఏడాది అమెరికాలో పర్యటివచారు. డల్లాస్, డెట్రాయిట్లల్లో ప్రవాసాంధ్రులతో సమావేశం అయ్యారు.
డల్లాస్లోని బెయిలీ హచీసన్ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గత ఏడాది స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏర్పాటు చేసిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించారు. ఆ తరువాత విదేశీ పర్యటనలకు వెళ్లలేదాయన.












Click it and Unblock the Notifications