జగన్ తాజా నిర్ణయాలు- చంద్రబాబుకు మరిన్ని అస్త్రాలు దొరికినట్లేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయాయి. మరో 9 నెలల్లో ఎన్నికలకు వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అవసరమైన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నూటికి నూరు శాతం అమలు చేసినట్లు చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా కేబినెట్ భేటీలోనూ జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాల్ని ఆమోదించింది. అయితే ఆ నిర్ణయాలు ఎవరికి వరంగా మారబోతున్నాయనే చర్చ సాగుతోంది.
నిన్న ఏపీ కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇందులో సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకురావడం, హెచ్ఆర్ఏ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మరికొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అలాగే తాజాగా ఉద్యోగులతో జరిపిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు కోసం 2027ను డెడ్ లైన్ గా పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం పదవీకాలం పూర్తి చేసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మూడేళ్లు అన్నమాట. ఈ లెక్కన ఉద్యోగుల హామీలన్నీ నెరవేర్చేసినట్లేని వైసీపీ చెబుతోంది.

ఉద్యోగుల విషయంలో వైసీపీ సర్కార్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్న విపక్ష టీడీపీ వాటిని తమకు వరాలుగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి దాని స్ధానంలో జీపీఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగుల్లో అసంతృప్తిని కాస్తయినా తగ్గించాలనేది వైసీపీ సర్కార్ వ్యూహంగా ఉంది. దీనికి ఉద్యోగ సంఘాల ఆమోదం కాసేపు పక్కనబెడితే ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ఘీకరణ కోసం పెట్టిన షరతుల ప్రకారం కేవలం 10 వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. దీనిపైనా అభ్యంతరాలున్నాయి.
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు కోసం 2027ను డెడ్ లైన్ గా పెట్టారు. అంటే మరో నాలుగేళ్ల పాటు విడతల వారీగా ఈ చెల్లింపులు చేస్తారన్నమాట. దీంతో ఇప్పటికే ఈ బకాయిలపై పోరాడుతున్న ఉద్యోగ సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి. దీంతో బకాయిల చెల్లింపుతో పాటు సీపీఎస్ స్ధానంలో జీపీఎస్ అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో షరతుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టీడీపీలో ఉన్న మాజీ ఉద్యోగ సంఘం నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు సాయంతో ఉద్యోగుల్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో జగన్ తాజా నిర్ణయాల్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా టీడీపీ మ్యానిఫెస్టోలో ఆయా అంశాల్ని పెట్టేందుకు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షరతుల్లేకుండా సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయడంతో పాటు బకాయిల చెల్లింపుకు మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగుల్ని ఈసారి ఎన్నికల్లో తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications