'రైతు భరోసా' కు లైన్ క్లియర్.. ఆ రోజే అన్నదాతల అకౌంట్ లోకి డబ్బులు
తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతు భరోసా నిధులకు ముహూర్తం ఖరారు చేసింది. వానాకాలం(ఖరీఫ్) సీజన్ కు సబంధించి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26 న ఖమ్మం జిల్లాలోని మధిరలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పథకం కింద రాష్టవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు వానాకాలం సాగు కోసం రూ. 9,000 కోట్ల రైతు భరోసా నిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
'రైతు భరోసా' నిధులను 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూలై మొదటివారంలోగా అందరికీ రైతు భరోసా అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పట్టా ఉన్న ప్రతి రైతు ఖాతాలో రూ. 6 వేలు జమ కానున్నాయి. అయితే యాసంగి సీజన్ లో రెండు ఎకరాలకే రైతు భరోసా అందించింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ. 12000 సాయం రైతుకు అందుతుంది. దీనిని రెండు విడతల్లో అంటే ఖరీఫ్, రబీ(వానాకాలం, యాసంగి) అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన సన్నరకం వరి సాగును ప్రోత్సహించడంతో పాటుగా పంటను పౌరసరఫరాల సంస్థ ద్వారా సజావుగా కొనుగోలు చేసేందుకు వీలుగా ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం జరగనుంది. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో నాగలింగం మొక్కను సీఎం రేవంత్రెడ్డి నాటనున్నారు. ఈమేరకు రూ.35.50 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.












Click it and Unblock the Notifications