చిరు, బాలయ్యకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్- వాల్తేరు వీరయ్యకు ఇలా, వీరసింహారెడ్డికి అలా..
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న రెండు టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డికి వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సినీ పరిశ్రమపై కత్తి కట్టారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కార్.. ఈ రెండు చిత్రాల ప్రీరిలీజ్ ఫంక్షన్ల అనుమతుల విషయంలోనూ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెండు చిత్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ సంక్రాంతి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 11న విడుదలవుతోంది. అలాగే బాలయ్య వీర సింహారెడ్డి చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. గతంలో పలు చిత్రాలకు ఇదే తరహాలో రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తమకు కూడా రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఒక్కో టికెట్ పై కనీసం రూ.60 రూపాయలు పెంచుకునేందుకు ఈ రెండు చిత్రాల నిర్మాత మైత్రీమూవీ మేకర్స్ అనుమతి కోరింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇందులో దాదాపు సగానికి పైగా కోత విధించింది.
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాకు అన్ని క్లాస్ లపై రూ.20 రూపాయల చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. అలాగే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు అయితే రూ.25 రూపాయల మేర అన్ని క్లాసులకూ పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. ఈ పెంచిన ధరలు పది రోజుల పాటు వర్తింపజేసేలా ప్రభుత్వం జీవోలో అనుమతించింది. దీంతో ఈ రెండు సినిమాల టికెట్ల ధరలు తాజా మార్పు ప్రకారం తొలి పది రోజులు అందుబాటులో ఉంటాయి.