జల వివాదం: సజ్జల సీరియస్ వార్నింగ్ -ఇచ్చింది కేసీఆర్కా? వైసీపీ నేతలకా? -ఈనెల 9న రచ్చే
కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపకం జరగాలన్న తాత్కాలిక ఒప్పందాన్ని పట్టించుకోబోమని, 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఏపీ అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పరస్పర దూషణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు..

విశాఖలో సజ్జల.. హుంకారాలపై
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో పర్యటించారు. జీజీహెచ్లో రోగుల సహాయకులకు మధురాన్నం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత భోజన వసతిని ఆయన ప్రారంభించారు. సజ్జల వెంట మంత్రులు శ్రీరంగనాధ రాజు, మేకతోటి సుచరిత, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజగడంపై స్పందించారు. కొద్ద రోజులుగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొనసాగుతోన్న హుంకరింపులపై సజ్జల హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.

అడ్డగోలు మాటలొద్దు..
కృష్ణా జలాల విషయంలో ఎవరు ఏది మాట్లాడినా సమస్య పరిష్కారం కోసమే తప్ప అడ్డగోలుగా మాట్లాడటం సబబు కాదని సజ్జల సూచించారు. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యేకానీ, రెండు దేశాల మధ్య కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ తప్పకుండా మాట్లాడతామని అంతేకానీ రెచ్చగొడితే రెచ్చిపోమని సజ్జల తెలిపారు. కాగా, సజ్జల చేసిన ఈ వార్నింగ్ వ్యాఖ్యలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించా? లేక సొంత పార్టీ వైసీపీ నేతలను ఉద్దేశించా? అనేదానిపై స్పష్టత రాలేదు.

ఏం చేయాలో జగన్కు తెలుసు
జల వివాదం అంశంలో ఎవరికి ఇబ్బంది కల్గించకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని సజ్జల స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలో సీఎం జగన్ కు అన్నీ తెలుసని, చేయాల్సిందంతా చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి దక్కాల్సిన దాంట్లో ఒక్క నీటి చుక్కను వదులుకోబోమని సజ్జల స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. అయితే, ఎవరేగానీ హూంకరించాల్సిన అవసరం లేదని సజ్జల సూచించారు. కాగా,

ఏపీ సర్కారు మరో రికార్డు
'మెగా ఇళ్ల శంకుస్థాపన' కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల్లో జరిగిన శంకుస్థాపనలు ఒక రికార్డ్ అని సజ్జల అన్నారు. గృహ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. తండ్రికి మించిన తనయుడు అని సీఎం వైఎస్ జగన్ నిరూపించుకున్నారని కొనియాడారు. వైఎస్ కంటే సీఎం జగన్ మరో ముందడుగు వేశారని తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి బాబు చేతులు దులుపుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొని పేదలకు ఇళ్లు ఇవ్వడం జరిగిందని సజ్జల చెప్పారు. ఇదిలా ఉంటే,

జల జగడంపై తెలంగాణ లేఖ, 9న రచ్చే
కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సోమవారం నాడు తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నది. ఏపీ సర్కారు రాసిన ఫిర్యాదు లేఖకు స్పందిస్తూ, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ సర్కార్ను ఇప్పటికే కేఆర్ఎంబీ వివరణ అడిగింది. కేఆర్ఎంబీ వివరణపై, ఇరు రాష్ట్రాలకు తాత్కాలిక నీటి కేటాయింపులపై కూడా అభ్యంతరం తెలుపుతూ ఇప్పుడు లేఖలో పేర్కొనే అవకాశం ఉంది.
ఈ నెల 9న జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్ర హక్కులపై కెఆర్ఎంబీని నిలదీయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తెలంగాణ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ నీటి రంగ నిపుణులతో నేడు జలసౌదలో ఇంటర్నేనల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రేపు కృష్ణా బోర్డుకి రాయబోయో లేఖలోని అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications