Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్-14 షరతులివే..
టీడీపీ యువనేత నారా లోకేష్ కు జగన్ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27నుంచి ప్రారంభించే యువగళం పాదయాత్రకు ఇవాళ అనుమతి మంజూరు చేసింది. అయితే అందులో 14 షరతుల్ని మాత్రం విధించింది.
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ నెల 27 నుంచి చేపట్టే యువగళం పాదయాత్రకు ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా చిత్తూరు జిల్లా ఎస్పీ ద్వారా ఈ అనుమతి మంజూరు చేశారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారంటూ టీడీపీ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
టీడీపీ యువనేత నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ నెల 27న చేపట్టే యువగళం పాదయాత్రకు పోలీసులు ఎట్టకేలకు అనుమతి మంజూరు చేశారు. కుప్పం నుంచి యాత్ర ప్రారంభించేందుకు వీలుగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న లోకేష్.. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. అయితే చిత్తూరు ఎస్పీతో పాటు డీజీపీ, హోం సెక్రటరీని సైతం అనుమతి కోరారు. అయితే చిత్తూరు పోలీసులు ఇవాళ లోకేష్ కు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం అందించారు. దీంతో లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి.
14 షరతులతో అనుమతి
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఈ నెల 27 నుంచి ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసిన చిత్తూరు పోలీసులు.. అందుకు 14 షరతులు విధించారు. ముందు 29 షరతులు పెట్టినా టీడీపీ అభ్యంతరాలతో వాటిని 14కు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇందులో పలు కీలక షరతులు ఉన్నాయి. వాటిని పాటించడంలో విఫలమైతే ఏ క్షణమైనా పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తామని పోలీసులు టీడీపీ నేతలకు పంపిన సమాచారంలో హెచ్చరించారు. దీంతో ఈ షరతులతో పాదయాత్ర ప్రారంభం కానుంది.
లోకేష్ పాదయాత్రకు షరతులివే ?
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనుమతిచ్చిన పోలీసులు మొత్తం 14 షరతులు విధించారు. ఇందులో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. రోడ్లపై పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రజలకు అసౌకర్యం కల్పించకూడదని పోలీసులు సూచించారు. అలాగే క్రాకర్స్ పేల్చకూడదన్నారు. పాదయాత్రతో అంబులెన్స్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. మరోవైపు పాదయాత్ర కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగితే అనుమతి రద్దు చేస్తామనే షరతు కూడా విధించారు. ఈ మేరకు 14 అంశాలతో కూడిన లేఖను పోలీసులు టీడీపీ నేతలకు పంపారు.