ఏప్రిల్ 20 తర్వాత ఏపీలో వేగంగా పరిణామాలు ! భారీ వ్యూహం రెడీ చేస్తున్న జగన్ ?
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో నెల రోజులుగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ పాలనతో పాటు అభివృద్ధి కూడా అటకెక్కింది. రోజువారీ కార్యకలాపాలు కూడా సాగకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేస్తే తప్ప పరిస్దితిలో మార్పు రాదని భావించిన సీఎం జగన్.. ప్రధానికి ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. అయితే ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇదే తరహాలోనే వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని.. ఏప్రిల్ 20 తర్వాత సడలింపులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో కేంద్రం సూచనల మేరకు నడుచుకుంటూనే ఏపీలో పరిస్ధితిని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ రంగం సిద్దం చేస్తున్నారు.
కరోనాతో గాడి తప్పిన రాష్ట్రం...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడగా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రద్దయ్యాయి. ఆర్దిక కార్యకలాపాలు నిలిచిపోగా.. రాజధాని తరలింపు సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సైతం అటకెక్కాయి. దీంతో వీటిని తక్షణం గాడిలో పెట్టాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే క్రమంలో లాక్ డౌన్ పొడిగింపును రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధానిని కోరిన సీఎం జగన్.. ఏప్రిల్ 20 తర్వాత గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే ఏప్రిల్ 20 తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతరంగికులతో చర్చిస్తున్నారు.
సజీవంగానే రాజధాని తరలింపు.. ముహుర్తం అదేనా ?
కరోనా తగ్గిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి రాజధాని తరలింపు వ్యవహారం అత్యంత ప్రాధాన్య అంశంగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇందుకోసం రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులను సైతం ఈ దిశగా విశాఖ వెళ్లేలా ఒప్పించింది. ముందుగా అనుకున్న ప్రకారం, ఉద్యోగులు కోరుతున్న ప్రకారం చూసినా మే 31లోపు తరలింపు చేపట్టాల్సిందే. కాబట్టి మే 3న లాక్ డౌన్ ముగియగానే ఉద్యోగుల తరలింపుకు సంబంధించిన కీలక నిర్ణయాలు వెనువెంటనే ప్రకటించేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 31లోపు ఉద్యోగుల తరలింపులో అనుకోని ఇబ్బందులు ఎదురైతే కనీసం సీఎం జగన్ అయినా విశాఖ వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఉద్యోగులను ఆన్ డ్యూటీ పద్ధతిలో వాడుకుంటూ వచ్చే సంవత్సరం తరలించే అవకాశముంది. ఇవన్నీ చేసేందుకు వీలుగా మూడు రాజధానులపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు వైసీపీ సర్కారు వ్యూహరచన చేస్తోంది.
స్ధానిక ఎన్నికలకూ సిద్దం..
రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఇందుకు కారణమైన ఎన్నికల కమిషనర్ తొలగింపు చేపట్టడం, ఆయన స్ధానంలో కొత్తగా జస్టిస్ కనగరాజ్ కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. నిన్న ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించిన కనగరాజ్... వాస్తవ పరిస్ధితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు కరోనా కారణంగా ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా పడగా.. ఆ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. ఆ తర్వాత ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం తగ్గితే ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దపడనుంది. ఇదే పరిస్ధితి ఉంటే జూన్ వరకూ ఎన్నికలు వాయిదా పడొచ్చని చెబుతున్నారు.
పేదల ఇళ్ల పంపిణీ, ఇతర నిర్ణయాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు మరికొన్ని కొత్త సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయింది. వాటిని తక్షణం ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ప్రారంభించిన పథకాల అమలు కూడా గాడిన పెట్టాల్సి ఉంది. ఇది సాధ్యం కాకపోతే ప్రజల్లో గత 10 నెలలుగా తెచ్చుకున్న మంచి పేరు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పాలన విషయంలోనూ భారీగా మార్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. త్వరలో సీఎస్ నీలం సహానీ పదవీకాలం ముగియబోతోంది. దీంతో ఆమె స్ధానంలో కొత్త సీఎస్ ఎంపికతో పాటు సీఎంవోలోనూ భారీ మార్పులకు రంగం సిద్దం చేస్తున్నారు.