అన్యాయంపై రాష్ట్రపతితో చెప్పా: జగన్, సిఎంపై సెటైర్
న్యూఢిల్లీ: విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన నేతృత్వంలో పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి అన్యాయం ఎప్పుడూ జరగలేదని, చరిత్ర ఎరుగని విధంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విభజనతో వచ్చే సమస్యలను వివరించామని, విభజనను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అసెంబ్లీలు ఆమోదిస్తేనే రాష్ట్రాలను విడగొట్టారని, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును వ్యతిరేకించి వెనక్కి పంపినా కేంద్రం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించేందుకే ముందుకు వచ్చిందని ఆరోపించారు. అందువల్ల విభజను ఆపాలని రాష్ట్రపతిని కోరినట్లు జగన్ తెలిపారు. ఆయన తమ సమస్యలను విన్నారని, తాను చేయగలిగింది చేస్తానని చెప్పినట్లు జగన్ తెలిపారు.
రాష్ట్రపతి ఏం చెప్పారని మీడియా ప్రశ్నించగా.. ఆయన చెప్పింది బ్లాక్ అండ్ వైట్గా చెప్పలేనుకదమ్మా అని జగన్ జవాబిచ్చారు. తనకు దేవుడిపై నమ్మకం వుందని, కొంత కాలంగా విభజనను అడ్డుకునేందుకు అన్ని పార్టీల నాయకులతో కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తోందని, దీన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అడ్డుకుంటాయని ఆశిస్తున్నట్లు జగన్ తెలిపారు.
విభజన బిల్లు పార్లమెంటుకు వస్తుందో రాదో చెప్పలేను కానీ, వస్తే ప్రతిపక్షాలు ఏకమై కాంగ్రెస్కు బుద్ధి వచ్చే విధంగా అడ్డుకుంటాయని జగన్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 20 రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు.
విభజనకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేశారని మీడియా ప్రతినిధులు చెప్పగా.. అరెరె నాలుగు గంటలపాటు సిఎం కిరణ్ దీక్ష చేశారా.. గొప్పగా ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం తాను ఎనిమిది రోజులపాటు తిండి లేకుండా దీక్ష చేశానని తెలిపారు. మూడు వారాల్లో ఎన్నికలు ఉందనగా 4 గంటలపాటు దీక్ష చేసి ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.
తనకు బిపి, షుగర్లు లేవని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుకు షుగర్ ఉందని తెలిపారు. 36 గంటలపాటు దీక్ష చేయమనండి షుగర్ పేషెంట్ ఎలా బ్రతుకుతాడో చూద్దామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాగా జగన్మోహన్ రెడ్డితోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.