రూ.30 కోట్లు ఇస్తే వెళ్లరా: బాబు-నెహ్రూపై జగన్, మళ్లీ 'పెళ్లాం' వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి 'పెళ్లాం' వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఆయన మంగళవారం నాడు మాట్లాడారు. నాయకుడికి విశ్వసనీయత, వ్యక్తిత్వం ముఖ్యమని చెప్పారు.
ఈ రెండు లేకుంటే సొంత భార్య కూడా ఆ నేత వెంట వెళ్లదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు టెంప్ట్ చేస్తే తమ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీని వీడుతున్నారని చెప్పారు.
తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి రూ.30 కోట్లు ఇచ్చి కొంటున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేరని చెప్పారు. తనకు ట్యూషన్ అవసరం లేదని, ఉపాధి హామీ చట్టం పైన చంద్రబాబు ట్యూషన్ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లో ఉన్న వాళ్లకు వ్యక్తిత్వం అవసరమని చెప్పారు. చంద్రబాబు విశ్వసనీయత లేదన్నారు. పార్టీ మారిన వారికి పదవి కావాలని, కానీ వాళ్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లలేరన్నారు. చంద్రబాబు రూ.20, 30 కోట్లు ఇస్తామని చెబుతున్నారని, వాటిని ఎవరు మాత్రం వద్దనుకుంటారని ప్రశ్నించారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు కూడా లేదన్నారు. పార్టీ మారిన వారికి, చంద్రబాబుకు విశ్వసనీయత, వ్యక్తిత్వం లేదని, వారిని భార్య కూడా నమ్మదన్నారు. ముఖ్యమంత్రి టెంప్ట్ చేస్తే జ్యోతుల పడ్డారన్నారు.