YS Jagan:జెండాలు జతకట్టడం వారి అజెండా..విపక్షాలకు సీఎం జగన్ మాస్ వార్నింగ్..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి పీసీసీ ఛీఫ్ గా కూడా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. అన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టేశారు. దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన వైఎస్ జగన్.. ఇవాళ మాత్రం ఉరవకొండలో జరిగిన వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్.. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు పరోక్షంగా వైఎస్ షర్మిలపైనా విమర్శలు గుప్పించారు. పక్కరాష్ట్రాల నుంచి చంద్రబాబు కోసం స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఈ ముగ్గురిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటూ పవన్ ను టార్గెట్ చేశారు.

జెండాలు జతకట్టడమే వారి అజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని సీఎం జగన్ అన్నారు. వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసిన ఈ సాంగ్లోని లిరిక్స్ను సీఎం జగన్ తన ప్రసంగంలో వినిపించారు. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్ అభిమానులు ఈ పాటకు స్టెప్పులు అదరగొడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక విపక్షాలపై నిప్పులు చెరిగిన జగన్ వారికి స్టార్ క్యాంపెయినర్లు చాలామందే ఉన్నారని.. తనకు మాత్రం స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే అంటూ వేదికపై చెప్పడంతో అక్కడికి వచ్చిన వారంత కరతాళధ్వనులతో జై జగన్ అంటూ నినదించారు.మీ బిడ్డ మిమ్మలనే నమ్ముకున్నాడని,మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే రావాలన్నారు. సైనికులుగా మీరే ముందుండి నడపాలన్నారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ను సీఎం చేసుకునేందుకు మాత్రమే కాదని, ప్రతి పేదవాడు బాగుపడాలంటే జగన్ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications