మెదక్పై ఆలోచించలేదు: జగన్ బిజీ, బీజేపీ పరిశీలనలో
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చెప్పారు. ప్రస్తుతం తాము అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నామని, ఉప ఎన్నిక పైన ఇంకా దృష్టి సారించలేదని చెప్పారు.
బీజేపీ పరిశీలనలో ఆరుగురు
మెదక్ లోకసభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విషయమై ఆరుగురి పేర్లను బీజేపీ నాయకత్వం పరిశీలించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, జిల్లా ఇన్చార్జి మనోహర్ రెడ్డి, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో చర్చించారు.
పోటీకి ఆసక్తి కనబరుస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎస్ఆర్ ట్రాన్స్పోర్టు అధినేత అంజిరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల రాజయ్యలతోపాటు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణల అభ్యర్థిత్వాలపై చర్చ జరిగింది.
తనకు టికెట్ కేటాయించమని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పట్టుపట్టలేదని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే బీజేపీ టికెట్ కావాలని ప్రతిపాదించిన ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు, ఒక తెరాస నాయకుడి అభ్యర్థిత్వంపై కూడా చర్చ జరిగిందట. ఆదివారం సాయంత్రం ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్లతో మరోసారి సమావేశమై అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.