వైఎస్ జగన్ ఏపీకి శాశ్వత సీఎం: రాపాక వరప్రసాదరావు, పూర్తి చంద్రముఖిగా మారారా?
అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీకి సానుకూలంగా ఉంటూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అదే పని చేశారు. జనసేన పార్టీ వైఖరిని ఎప్పుడూ లెక్కలోకి తీసుకోని ఈ ఎమ్మెల్యే తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు.

ఏపీకి శాశ్వత సీఎం జగనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాదరావు మొదట్నుంచి కూడా అధికార వైయస్సార్ పార్టీకి సానుకూలంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, సొంత పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.

జగన్ పాలనపై ప్రశంసలు..
ఇప్పటి వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలన్నింటికీ రాపాక జై కొట్టడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు మహిళలకు ఏడాదికి రూ. 24వేల చొప్పున ఇవ్వడం గొప్పవిషయమని రాపాక అన్నారు. అనుకున్నదానికంటే 6 నెలల ముందుగానే లబ్ధి చేకూరుస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా సీఎం వైఎస్ జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని రాపాక కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ప్రజోపయోగ పథకాలు మరిన్ని తీసుకొస్తారని ఆకాంక్షించారు.

జగనే నెంబర్ 1 సీఎం.. వైసీపీ సంబరాలు..
రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాశ్వత సీఎంగా జగనే ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు. కాగా, జనసేన ఎమ్మెల్యే అయిన రాపాక సీఎం జగన్పై ప్రశంసలు కురిపించడంతో అధికార వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా వాస్తవాలు మాట్లాడారని రాపాకపై ప్రశంసలు కురిపిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. అంతేగాక, రాపాక వ్యాఖ్యలను ప్రచురితం చేసిన వార్తా కథనాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారు.
Recommended Video

పూర్తి చంద్రముఖిగా మారరంటూ..
ఇక జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాపాక వరప్రసాదరావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలిచి అధికార వైసీపీ వంతపాడటంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి కనబడింది మీకు? కరోనా విఫలమైనా? ప్రశంసలా? అంటూ రాపాకపై మండిపడుతున్నారు. పూర్తి చంద్రముఖిగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications