కుటుంబంతో విదేశీ పర్యటనకు జగన్: సీనియర్లకు పగ్గాలు, సరైన నిర్ణయమేనా?
హైదరాబాద్: వైసీపీ అధినేత వైయస్ జగన్ గురువారం బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పది రోజుల తర్వాత తిరిగి మళ్లీ 26న తిరిగి హైదరాబాద్కు వస్తారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన బ్రిటన్ పర్యటనకు వెళుతున్నారు. వాస్తవానికి ఈ నెల 18న ఆయన బ్రటిన్ పర్యటనకు బయల్దేరి వెళ్లాల్సి ఉన్నప్పటికీ రెండు రోజులు మందుకు మార్చారు.
రాష్ట్రంలో ముద్రగడ దీక్ష నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయిస్తారు. ఇలాంటి సమయంలో వైయస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం పెద్ద చర్చనీయాంశమైంది.
అయితే పార్టీ వ్యవహారాలను విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారికి అప్పగించి ఆయన విదేశీ పర్యనటకు బయల్దేరుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే జగన్ విదేశీ పర్యటన టీడీపీకి కలిసొస్తుందేమో చూడాలి.
ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి రప్పించడానికి ఇదే మంచి తరుణం. ఈ క్రమంలో వైయస్ జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా సీనియర్లపైనే పడింది. గురువారం చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు.
ఇటీవల విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా అమర్నాథ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నలుగురు పార్టే మారే అవకాశం ఉంటే, ఈ పది రోజుల్లోనే పార్టే మారే అవకాశం ఉంటుంది. దానికి సీనియర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అయితే ఈ నలుగురు టీడీపీలోకి చేరనున్నట్లు వార్తలు కూడా ఎక్కడా రాలేదు. మరోవైపు ముద్రగడ పద్మనాభం దీక్షకి జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ముద్రగడ దీక్ష విషయంలో పార్టీకి చెందిన సీనియర్లని కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యేందుకు అనుమతించారు కాబట్టి, ఈ విషయంలో వారికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించారని భావించొచ్చు.
దీంతో ఏపీలో జగన్ లేని తరుణంలో ముద్రగడ విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించబోతుందనేది కాస్త ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా ఉన్న సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం, పార్టీని సీనియర్ల చేతిలో పెట్టడం వైసీపీలో జగన్ ఒక కొత్త ప్రయోగానికి తెర తీశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటివరకు పార్టీ జగన్ నిర్ణయాల్ని, వ్యూహాల్నే అమలు చేస్తోంది. కానీ ఈ పది రోజులు పార్టీ వ్యవహారాలకు జగన్ దూరంగా ఉండటంతో సీనియర్లతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సమిష్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందని అంటున్నారు.