పార్టీ ఎల్పీగా జగన్, బాలయ్యకు మంత్రి పదవి ఖరారు!
కడప/ఖమ్మం/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎల్పీ సమావేశమైంది. ఈ సందర్భంగా శాసన సభ్యులు నేతగా జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకవ్యాఖ్య తీర్మానంతో జగన్ను ఎన్నుకున్నారు. అంతకుముందు జగన్, విజయమ్మ, ఎమ్మెల్యేలు వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
పార్టీని వీడం: ఎమ్మెల్యేలు
తాము ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటామని, జగన్ నాయకత్వంలోనే పని చేస్తామని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్ లాల్లు స్పష్టం చేశారు. వారిని చేర్పించుకునేందుకు తెరాస పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
చివరి వరకు జగన్తోనే:
తాను చివరి వరకు వైయస్ జగన్ వెంటే ఉంటానని కదిరి శాసన సభ్యుడు అత్తార్ చాంద్ బాషా చెప్పారు. తాను టిడిపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
బాలకృష్ణకు మంత్రి పదవి
హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన హీరో నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి వరించే అవకాశముంది. మంత్రివర్గంలో బాలయ్యకు బెర్తును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, జెసి ప్రభాకర్ రెడ్డి, పార్థసారథి కూడా మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాలను టిడిపి గెలుచుకున్న నేపథ్యంలో బాలయ్యతోపాటు మరొకరికి కూడా అవకాశం రావొచ్చంటున్నారు.