వైఎస్సార్ జిల్లాలో జగన్ రెండోరోజు టూర్-తండ్రికి నివాళులు-పులివెందులపై సమీక్ష
వైఎస్సార్ జిల్లా : దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఇతర కార్యక్రమాల కోసం పులివెందుల బయలుదేరి వెళ్లారు.
Recommended Video
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ రెండోరోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రూ.3వేల కోట్లు పంటల బీమా అందించామన్నారు. ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదన్నారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్స్ ఏజెన్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
రైతులంతా ఈ-క్రాప్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలపై మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్యశాఖలోనే 40వేల ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం జగన్ చెప్పారు. చక్రాయపేట మండలంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.