ys jagan in pulivendula : పులివెందుల రివ్యూలో జగన్ ఎమోషనల్-నాన్న చనిపోయాక..
ఏపీలో రాష్ట్రానికి సంబంధించిన పలు శాఖలపై నిత్యం రివ్యూలతో బిజీగా కనిపించే సీఎం జగన్ ఇవాళ సొంత జిల్లా వైఎస్సార్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం పులివెందులపై ప్రత్యేక సమీక్ష చేశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ఇవాళ పులివెందుల నియోజకవర్గ సమీక్షను సీఎం జగన్ ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో.. అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు.
రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పార్ణపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద.. వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద.. జగన్ లింగాల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా.. సొంత నియోజకవర్గ ప్రజలపై ఉన్న మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో.. జగన్ నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు."నాన్న చనిపోయాక.. మీరంతా అందించినంసహకరం, మనోధైర్యంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నాను.."" అంటూ.. పులివెందుల సొంత నియోజకవర్గంలోని లింగాల మండల ప్రజలకు జగన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా.. పాడా అభివృద్ధి పనుల పురోగతిపై.. రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు వివరించగా... లింగాల మండలం, పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై.. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి వివరించారు. అనంతరం పలువురు నాయకులు.. పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వగా... పలువురు నాయకులు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలను అందివ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ, ప్రణాళికా ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.... అందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మతి, సహకారం ఎంతో అవసరం అన్నారు. గ్రామ లోగిళ్ళలోనే.. గ్రామ సచివాలయాల ద్వారా.. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందివ్వడం జరుగుతోందన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే.. ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని సూచించారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే.. ప్రజా వ్యవస్థ పటిష్ఠంగా సాగుతుందన్నారు.నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా.. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఎలాంటి తావులేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న వైసిపి నాయకులకు, అధికారులకు జగన్ అభినందనలు తెలిపారు.