ఆదాయం తీసుకురండిలా.. మంత్రులు, అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు...
ఏపీలో ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ప్రస్తుతం వస్తున్న ఆదాయంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే కొత్తగా ఆదాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.
అమరావతి: ఏపీలో ఆదాయార్జనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నట్లు అధికారులు వివరించారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 2022 వరకూ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం ఉంటే... ఏపీలో వసూళ్లు 26.2 శాతంగా ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.
జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించినట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ.46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.
ఈ లెక్కన దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా సీఎంకు వివరించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నట్లు అధికారులు వివరించారు.

అనంతరం మాట్లాడిన సీఎం జగన్.. ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.గనులు-ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ. 3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్లు మాత్రమే అర్జించారు. నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు. ఆపరేషన్లో లేని గనులను ఆపరేషన్లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.
అలాగే రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యం రూ.3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications