అందుకే గుంటూరు దీక్ష: మతిమరుపంటూ బాబును ఏకేసిన వైయస్ జగన్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను, రైతులను మోసం చేశారు కాబట్టే తాను దీక్ష చేస్తున్నానని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను, రైతులను మోసం చేశారు కాబట్టే తాను దీక్ష చేస్తున్నానని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం గుంటూరు నల్లపాడు రోడ్డులో రైతు సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు సరైన ధర లభించక రైతుల కడుపు మండిపోతోందని అన్నారు.
చంద్రబాబు రైతులను పట్టించుకునే స్థితిలో లేరని అన్నారు. రైతులను ఆదుకునేలా చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం రావాలని అన్నారు. బాబు పాలనలో మోసపోయిన రైతులకు తోడుగు, అండగా నిలబడేందుకే తాను ఈ దీక్ష చేస్తున్నట్లు వైయస్ జగన్ పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ధర్నా చేస్తూ హుడా కమిటీ సిఫార్సుల ప్రకారం ఎకరాకు రైతుకు రూ.10 నుంచి 15వేల ధర ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం అవేమీ గుర్తులేవని అంటున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఎన్నికల సమయంలో తాను రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలుసుకుని.. చంద్రబాబు 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని గొప్పలు పోయారని మండిపడ్డారు. బాబు అధికారంలోకి వచ్చి ఇప్పటికి మూడేళ్లైనా రైతులకు మద్దతు ధరల లభించడం లేదని ఎద్దేవా చేశారు.

అంతేగాక, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మద్ధతు ధర ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయనెవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏడాది రూ. 50 మేర ధర పెంచుతూ రైతులకు భిక్షమెత్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ.4800కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టారని ఆరోపించారు.
బాబు పాలన తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 5వారాల క్రితం మిర్చి మద్దతు ధర రూ.6వేలుంటే ఇప్పుడు మిర్చి ధర క్వింటాలుకు రూ. 2వేలకు పడిపోయిందని అన్నారు. తాను రైతుల కోసం ఆందోళన చేసినా రైతులకు మద్దతు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని అన్నారు.
బాబు పాలనలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు రైతులకు కాకుండా వ్యాపారులకు అండగా ఉంటున్నాడని ఆరోపించారు. 20క్వింటాళ్లు మాత్రమే అమ్ముకోవాలనే నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. కోటి మంది రైతులకు ఖాతాలుంటే 40లక్షల ఖాతాలపై ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు.
శీతల గిడ్డంగులను రైతులకు కేటాయించడం లేదని, ఏడాదికి గిడ్డంగులకు చెల్లించే మొత్తాన్ని రూ.160 నుంచి 190కి పెంచారని అన్నారు. తన దీక్షకు మద్దతు తెలిపిన రైతులు, ప్రజలకు జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications