మోడీ ఓ లక్కా! బాబు డ్రామాలు అంతాఇంతా కాదు: జగన్ నిప్పులు
నెల్లూరు: కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పకుండా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాటకాలాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్తో చంద్రబాబు బాధ పడ్డారట, అన్యాయం చేసినట్లు ఆవేదన చెందుతున్నారట.. అని ఎద్దేవా చేశారు.
బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమని చెప్పిన జగన్.. ఈ ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని, టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. టీడీపీ మంత్రులుగా ఉన్న కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాతే బడ్జెట్ను ప్రవేశపెట్టారని, అయినా, ఈ బడ్జెట్లో తనకు తెలియకుండానే అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.
బాబు బాధపడ్డారట
‘కేంద్ర బడ్జెట్ను చూసి చంద్రబాబు చంద్రబాబు బాధపడ్డారట. వెంటనే కేంద్ర బడ్జెట్పై మంత్రులు, ఎంపీలతో మాట్లాడరట. ఈ విధంగా ఎల్లో మీడియా పేపర్లలో, టీవీలల్లో చంద్రబాబు ఇస్తున్న లీకులను చూసి ఆశ్చర్యం వేసింది. మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారా? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ ఇది. ఇదే మొదటిసారి అన్నట్టు చంద్రబాబు బాధపడుతున్నారు' అని జగన్ మండిపడ్డారు.
అందుకే మోడీని తిట్టే పని..
గత నాలుగేళ్లలో చంద్రబాబు ఏరోజూ మోడీని, బీజేపీని ఏ రోజూ తిట్టలేదని, కానీ, గత రెండురోజులుగా మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ హడావిడి చేస్తున్నాడని జగన్ విమర్శించారు. గతంలో ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. కేంద్రం ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ ‘కొడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?'అని చంద్రబాబు చెప్పలేదా? అని గుర్తు చేశారు. ఇన్నాళ్లు కేంద్రం గురించి ఏం మాట్లాడని చంద్రబాబు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఎవరో ఒకరి మీద నెపం మోపి.. బండలు వేసి.. తాను తప్పించుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. అందుకే ప్రధాని మోడీని తిట్టే పనిని పెట్టుకున్నారని జగన్ ఆరోపించారు.
మోడీ ఓ లక్కా..?
పిల్లనిచ్చి పెళ్లి చేసిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ప్రజలు, మోడీ ఓ లెక్కానా? అందుకే వారికీ వెన్నుపొటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవిని అని ఊదరగొట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ మాటమార్చారని గుర్తుచేశారు. కేంద్రాన్ని హోదా అడగకుండా ఖూనీ చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ బాబు ఊదరగొడుతున్నారని విమర్శించారు.
జాబు ఉండాలంటే.. బాబు పోవాలని..
చంద్రబాబుకు టైంపాస్ కానప్పుడల్లా.. తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి విదేశాలకు వెళుతున్నారని, ఆయన వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ సంస్థ వస్తుందని, బుల్లెట్ ట్రెయిన్ వస్తుందని, ఎయిర్ బస్సు వస్తుందని మీడియాలో ఊదరగొడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని అప్పుడు చెప్పారని.. ఇప్పుడు జాబు ఉండాలంటే బాబు పోవాలని ప్రజలు అనుకుంటున్నారని జగన్ చెప్పారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో 200ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని, ఇది బాబు పాలనకు నిదర్శనమని అన్నారు.