చంద్రబాబుకు తేడా తెలియదు, కౌరవసభ: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రకటనకు, తీర్మానానికి తేడా తెలియదని, అది తెలియకుండానే బీసీలపై తీర్మానం ప్రతిపాదించి, ఆమోదింపజేసుకున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బీసీలపై తీర్మానం చేసి శానససభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారనే విషయం చంద్రబాబుకే తెలియదని ఆయన అన్నారు.
బీసీల తీర్మానాన్ని ఆమోదించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తీర్మానం ప్రతిపాదించడానికి కనీసం పది రోజుల ముందు నోటీసు ఇవ్వాలనే నిబంధనను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. శాసనసభ కౌరవసభను తలపించిందని, సరిగ్గా కౌరవుల మాదిరిగానే టిడిపి సభ్యులు 101 మంది ఉన్నారని ఆయన అన్నారు.
రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాల మాఫీకి ఎగనామం పెట్టడానికి బీసీ తీర్మానాన్ని ప్రతిపాదించారని ఆయన విమర్శించారు. రుణమాఫీలపై దృష్టి వెళ్లకుండా చూసుకోవడానికి నామ్ కే వాస్తేగా బీసీ తీర్మానం పెట్టారని ఆయన అన్నారు. బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే ముందుగానే ఎందుకు తీసుకుని రాలేదని ఆయన అడిగారు.

తాము మాట్లాడితే చిన్నచూపు చూసే విధంగా నీకు తెలియదు అన్నట్లుగా, అనుభవం లేదని బురద తనపై బురద చల్లుతున్నారని, చంద్రబాబుకు తన వీపు తనకు తెలియడం లేదన ిఆయన అన్నారు. స్పీకర్ వాళ్ల మనిషే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం వాళ్లు మాత్రమే మాట్లాడి వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టిపోసి అయిపోయిందనడమే బీసీ సంక్షేమమా అని ఆయన అడిగారు.
చంద్రబాబు 45 నిమిషాలు మాట్లాడారని, టిడిపివాళ్లు ముగ్గురు మాట్లాడారని, తమ పార్టీవాళ్లు అప్పటికప్పుడు ఇద్దరు మాట్లాడారని ఆయన చెబుతూ ప్రతిపక్ష నాయకుడిగా తాను సమయం అడిగినా ఇవ్వలేదని ఆయన అన్నారు. తనను కావాలని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వాళ్లు మనుషులా, రాక్షసులా అని అనిపించిందని జగన్ వ్యాఖ్యానించారు. బీసీలను రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో బీసీల కోసం అమలు చేసిన పథకాల గురించి ఆయన వివరించారు. తాము చదువుకుని వస్తామని, ఏం జరుగుతుందో తెలుసుకుని వస్తామని, వాళ్లలాగా అబద్ధాలు చెప్పబోమని, మోసాలు చేయబోమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆమోదించుకున్న బడ్జెట్లోని లోపాలను జగన్ ఎత్తి చూపారు. ఈ తప్పుల వల్ల నష్టపోయేది వాళ్లేనని ఆయన అన్నారు. రెవెన్యూ లోటు 6 వేల కోట్లా, 25 వేల కోట్లా చెప్పాలని ఆయన అన్నారు. తప్పుడు లెక్కలపై కాగ్కు, కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికా సంఘానికి లేఖలు రాస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications