అందుకే నారాయణ హత్య, కేఈ పాత్రధారి, బాబు కుట్రదారుడు: ఏకేసిన జగన్
ఇసుక మాఫియాపై కోర్టుకు వెళ్లినందుకే పథకం ప్రకారం తమ పార్టీ నేత నారాయణ రెడ్డిని దారుణంగా హత్య చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఇసుక మాఫియాపై కోర్టుకు వెళ్లినందుకే పథకం ప్రకారం తమ పార్టీ నేత నారాయణ రెడ్డిని దారుణంగా హత్య చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నారాయణ రెడ్డి హత్యపై గవర్నర్ నర్సింహన్కు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు.
బాంబులు, కత్తులతో దాడి: జగన్ పార్టీ పత్తికొండ ఇంచార్జ్ దారుణ హత్య, కర్నూలు ఎస్పీ స్పందన
కర్నూల్ బంద్: కేఈ తనయుడిపై కేసు, నారాయణరెడ్డి హత్యతో హైటెన్షన్
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో హత్యారాజకీయాలు, శాంతి భద్రతలపై ఫిర్యాదు చేసినట్లు జగన్ తెలిపారు. ప్రలోభాలకు లొంగకపోవడంతోనే నారాయణ రెడ్డిని దారుణంగా హత్య చేశారని అన్నారు. ఓ వైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, మరోవైపు తమకు లొంగని నేతలను ఇలా హత్యలు చేయిస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు.
బాబు కుట్రదారు.. కేఈ పాత్రదారుడు
మనుషులను చంపేస్థాయికి చంద్రబాబు దిగజారారని ధ్వజమెత్తారు. ఇంతకన్నా కిరాతకం ఏమీ ఉండదని అన్నారు. నారాయణ రెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాత్ర ఉందని, చంద్రబాబునాయుడు దీని కుట్రదారు అని ఆరోపించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రభుత్వ హత్యలపై గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు జగన్ తెలిపారు.
బాబు హయాంలో ప్రజాస్వామ్యం బతకదు
చంద్రబాబు చేస్తున్న హత్యా రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఇక బతకదని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఈ మూడేళ్ల కాలంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా మంది హత్యలకు గురయ్యారని అన్నారు. ఏకంగా ఎమ్మార్వో కార్యాలయంలోనే హత్యలకు పాల్పడ్డారని అన్నారు. అంతేగాక, 132జీవోలు జారీ చేసి నిందితులపై కేసులు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు.
పక్కా ప్రణాళికతోనే హత్య
నారాయణ రెడ్డి దగ్గర ఆయుధాలు లేకుండా చేసి, పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని జగన్ అన్నారు. చిత్తూరులో 26మంది లేబర్లను కాల్చి చంపిన కేసులో చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సిందని జగన్ చెప్పారు. ఇంతవరకు బాబుపై కేసే లేదని అన్నారు. కర్నూలులో జరుగుతున్న హత్యా రాజకీయాలకు బాబే కారణమన్నారు.
ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా..
తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన చంద్రబాబు అప్పుడు కూడా జైలుకెళ్లాల్సిందని అన్నారు. స్విస్ ఛాలెంజ్ కేసులో కూడా చంద్రబాబు జైలుకెళ్లాల్సిందని చెప్పారు. ఈ కేసులన్నింటిని చంద్రబాబు తప్పించుకుంటున్నారని అన్నారు.
ఏపీ దురృష్ణటం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని జగన్ అన్నారు. జస్టిస్ కట్జూ కూడా ఏపీలో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోందంటూ రాష్ట్రంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
ముమ్మాటికే ప్రభుత్వ హత్యే
25మంది ట్రాక్టర్ అడ్డుపెట్టి, నారాయణ రెడ్డి వద్ద ఆయుధాలు లేకుండా చేసి దారుణంగా హత్య చేశారని చెప్పారు. నారాయణ రెడ్డి తనకు భద్రత కల్పించాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. అందుకే నారాయణ రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోందని జగన్ మండిపడ్డారు. కాగా, జగన్ వెంట ఎమ్మెల్యే రోజా, ఎంపీ బుట్టా రేణుక, తదితరులు ఉన్నారు.