కడపలో చంద్రబాబు ప్రలోభాలు, వైయస్ వివేకానందని గెలిపించండి: జగన్
స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకుందామని వైసిపి అధినేత జగన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు.
కడప: తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఆ పార్టీ పతనం తప్పదని, దేవుడు మన పక్షాన ఉన్నాడని, రెండేళ్ల తర్వాత మన పరిపాలన వస్తుందని, సమష్టి కృషితో స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకుందామని వైసిపి అధినేత జగన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు.
అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరూ గురి కావొద్దని హితవు పలికారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం జగన్ బెంగుళూరు నుంచి నేరుగా ఇడుపులపాయ చేరుకున్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై.. నిన్న పవన్ కళ్యాణ్, నేడు చిరంజీవి కూతురు
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో మండలి ఎన్నికలపై సమావేశమయ్యారు. ఒక్కొక్క నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను ఒక్కోసారి సమావేశపరిచి వారితో మాట్లాడారు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు సాగింది. ఎమ్మెల్యేలు అంజాద్ బాష, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. టిడిపి ప్రలోభాలకు గురిచేసి 21 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని, అదే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కష్టకాలాల్లో అండగా ఉన్నారని, మీ మేలు ఎప్పటికి మరిచిపోనని, దేవుడు మనపక్షాన ఉన్నారని జగన్ అన్నారు.
టిడిపి పతనం తప్పదని, మనకు రాబోయేవన్నీ మంచి రోజులేనని, రెండేళ్ల తర్వాత అధికారం వస్తుందని, అందరికి న్యాయం చేస్తానని చెప్పారు. కడపలో మండలి ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాలు 200 పైగా మనకే ఉన్నాయని, నైతికంగా టిడిపి అసలు పోటీనే పెట్టకూడదన్నారు. ప్రలోభాలను నమ్ముకొని పోటీ పెట్టారన్నారు.
సమష్టి కృషితో వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకుందామన్నారు. కాగా, టిడిపి మండలి ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రకటనలు గుప్పిస్తున్న నేపథ్యంలో సొంతపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇడుపులపాయ సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన పలువురు కౌన్సిలర్లు కూడా తిరిగి వైసిపిలోకి తిరిగి వచ్చారు.